SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 04 September 2026, 12:18 am Posted by : SALAM PRODDATUR

సీఎం తో మల్లేల లింగారెడ్డి భేటీ

 

నియోజకవర్గ సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లిన మాజీ ఎమ్మెల్యే

 

సలాం ప్రొద్దుటూరు – అమరావతి:

ప్రొద్దుటూరు నియోజకవర్గంలో నెలకొన్న పలు సమస్యల పరిష్కారం, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల అంశాలపై మాజీ ఎమ్మెల్యే మల్లేల లింగారెడ్డి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశారు. అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రితో సమావేశమైన ఆయన నియోజకవర్గానికి సంబంధించిన పలు కీలక అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు.ప్రొద్దుటూరు నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన సమస్యలు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వాటి పరిష్కారానికి ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రితో మల్లేల లింగారెడ్డి చర్చించినట్లు తెలిపారు. ముఖ్యంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గంలో పార్టీ బలోపేతం, నాయకులు–కార్యకర్తల సమన్వయం, స్థానిక పరిస్థితులు తదితర అంశాలపై కూడా ముఖ్యమంత్రితో చర్చ జరిగినట్లు సమాచారం.నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేయాల్సిన అవసరాన్ని లింగారెడ్డి సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది.రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గ్రామస్థాయిలో పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుని ముందుకు సాగడం, ప్రజలతో నిరంతరం మమేకమై వారి సమస్యలను పరిష్కరించే దిశగా పనిచేయడం వంటి అంశాలపై కూడా ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం.ప్రొద్దుటూరు నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారం అందించాలని లింగారెడ్డి ముఖ్యమంత్రిని కోరగా, నియోజకవర్గ సమస్యలపై తగిన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.మాజీ ఎమ్మెల్యే మల్లేల లింగారెడ్డి ముఖ్యమంత్రిని కలవడం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రొద్దుటూరు నియోజకవర్గ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.