SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 04 September 2026, 9:23 am Posted by : SALAM PRODDATUR

బీసీలపై వివక్షను తీవ్రంగా ఖండిస్తున్నాం..

 

రాచమల్లు వ్యాఖ్యలను ఖండించిన మార్కెట్ యార్డ్ చైర్మన్ పట్నం లక్ష్మణ్

 

సలాం   ప్రొద్దుటూరు:

బీసీల పట్ల వివక్ష చూపే విధానాలను తీవ్రంగా ఖండిస్తున్నామని మార్కెట్ యార్డ్ చైర్మన్ పట్నం లక్ష్మణ్ అన్నారు. గురువారం ప్రొద్దుటూరులో జరిగిన బీసీ నేతల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బీసీ వర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని పేర్కొన్నారు.

 

ఇటీవల మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను లక్ష్మణ్ తీవ్రంగా ఖండించారు. బీసీ వర్గానికి చెందిన ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్‌తో పాటు పలువురు బీసీ నాయకుల పట్ల గతంలో చోటుచేసుకున్న పరిణామాలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.

 

ప్రజాస్వామ్యంలో ప్రజలచే ఎన్నికైన ప్రజాప్రతినిధులను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. రాజకీయ విభేదాలు సహజమే అయినప్పటికీ, వ్యక్తిగతంగా కించపరిచేలా లేదా అవమానకరమైన పదజాలాన్ని ఉపయోగించడం సమంజసం కాదని పట్నం లక్ష్మణ్ పేర్కొన్నారు.

 

టీడీపీ పట్టణ అధ్యక్షుడు చల్లా రాజగోపాల్ యాదవ్‌పై చేసిన వ్యాఖ్యలను కూడా ఆయన తీవ్రంగా ఖండించారు. ఎన్నో సంవత్సరాలుగా ప్రజలకు సేవ చేస్తున్న వ్యక్తులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని అన్నారు. ప్రజా జీవితంలో ఉన్న నాయకులపై విమర్శలు చేసే సమయంలో హుందాతనం పాటించాలని సూచించారు.

 

రాజకీయాలు రాజరిక వ్యవస్థ కాదని, ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలని పట్నం లక్ష్మణ్ అన్నారు. బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలను తాము సహించబోమని స్పష్టం చేశారు.

 

బీసీ వర్గాలపై ఇదే విధమైన ధోరణి కొనసాగితే అవసరమైన సమయంలో బీసీలంతా ఐక్యంగా ముందుకు వచ్చి తగిన విధంగా స్పందించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. బీసీల గౌరవం, ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలిపారు.

 

రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఉపయోగించిన పదజాలాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇకనైనా వ్యక్తిగత విమర్శలు, అనుచిత వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని మార్కెట్ యార్డ్ చైర్మన్ పట్నం లక్ష్మణ్ కోరారు.