SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 04 September 2026, 9:12 am Posted by : SALAM PRODDATUR

బీసీలను భయభ్రాంతులకు గురిచేసే వ్యాఖ్యలు మానుకోవాలి– వీఎస్ ముక్తియార్

 

చల్లా రాజగోపాల్‌కు వారం రోజుల్లో క్షమాపణ చెప్పాలి.. లేకుంటే క్రిమినల్ కేసులు: షేక్ కార్పొరేషన్ చైర్మన్

సలాం  ప్రొద్దుటూరు:

మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి రోజూ పత్రికల ద్వారా బీసీ కులస్తులను భయభ్రాంతులకు గురిచేసే విధంగా మాట్లాడుతున్నారని రాష్ట్ర షేక్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ వీఎస్ ముక్తియార్ ఆరోపించారు. గురువారం ప్రొద్దుటూరులో జరిగిన బీసీ నేతల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

 

బీసీ సోదరులు చెప్పని మాటలను కూడా వారు చెప్పినట్లుగా ఆపాదిస్తూ, బీసీలపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మాటలు, చేష్టలు బీసీలను లక్ష్యంగా చేసుకున్నట్టుగా ఉన్నాయని విమర్శించారు. ప్రజలను అయోమయానికి గురిచేసే విధంగా అబద్ధాలను నిజాలుగా నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

 

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున చైర్మన్ పదవిలో ఉన్న మహిళా బీసీ కు ఐదేళ్ల పాటు అవకాశం ఇచ్చి, చివరకు ఆ పదవిని కుటుంబ సభ్యులకు అప్పగించి, నామమాత్రంగా కుర్చీలో కూర్చోబెట్టి రాజకీయ నాటకం ఆడారని ముక్తియార్ ఆరోపించారు. ఈ విషయాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.

 

రాచమల్లు శివప్రసాద్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన టికెట్ వల్లే గెలిచారని, లేకపోతే ఆయనకు పదివేల ఓట్లు కూడా వచ్చేవి కావని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి గతంలో పేర్కొన్న విషయాన్ని ముక్తియార్ గుర్తుచేశారు. దీనికి స్పందిస్తూ రాచమల్లు తన కుమారుడిని స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దింపుతానని చెప్పారని తెలిపారు.

 

ఈ నేపథ్యంలో తాము కూడా బీసీల నుంచి ఒకరిని స్వతంత్ర అభ్యర్థిగా చైర్మన్ ఎన్నికల్లో బరిలోకి దింపుతామని ముక్తియార్ సవాల్ విసిరారు. రాచమల్లుకు ధైర్యం ఉంటే తన కుమారుడినో, కుటుంబ సభ్యుల్లో ఒకరినో పోటీకి దింపాలని అన్నారు. బీసీల నుంచి తాము అభ్యర్థిని నిలబెట్టి తమ బీసీ సోదరుల సత్తా ఏమిటో చూపిస్తామని ప్రకటించారు.

 

రాచమల్లు రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తిగా హుందాగా వ్యవహరించాలని ముక్తియార్ సూచించారు. “నాలుక కోస్తాం” వంటి బెదిరింపు వ్యాఖ్యలు చేయడం సరికాదని, అలాంటి వ్యాఖ్యలను ఎవరూ సహించబోరని హెచ్చరించారు.

 

బీసీ నాయకుడు చల్లా రాజగోపాల్ యాదవ్‌పై చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని ముక్తియార్ డిమాండ్ చేశారు. చల్లాకు క్షమాపణ చెప్పాలని, ఇందుకు వారం రోజుల సమయం ఇస్తున్నామని తెలిపారు. ఈలోగా క్షమాపణ చెప్పకపోతే చల్లా రాజగోపాల్ యాదవ్‌తో కలిసి తామంతా రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

 

రాబోయే చైర్మన్ ఎన్నికల్లో బీసీల రాజకీయ చైతన్యం ఏమిటో చూపిస్తామని ముక్తియార్ స్పష్టం చేశారు. బీసీలను కించపరిచే లేదా భయపెట్టే విధంగా ఎవరైనా మాట్లాడితే ఇకపై బీసీ సమాజం ఐక్యంగా స్పందిస్తుందని ఆయన అన్నారు.