–పీఆర్సీ, పెండింగ్ డీఏలు సహా సమస్యలు పరిష్కరించాలి
–ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు కార్యాచరణకు సిద్ధం
–జేఏసీ చైర్మన్ జె. రామసుబ్బయ్య యాదవ్
సలాం ప్రొద్దుటూరు :
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే ఉద్యోగ సంఘాల ప్రతినిధులను చర్చలకు ఆహ్వానించాలని ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ ప్రొద్దుటూరు తాలూకా అధ్యక్షుడు, జేఏసీ చైర్మన్ జె. రామసుబ్బయ్య యాదవ్ డిమాండ్ చేశారు. పీఆర్సీ, ఐఆర్, పెండింగ్ డీఏలు, సరెండర్ లీవులు తదితర అంశాలపై ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని కోరారు.ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ ప్రొద్దుటూరు తాలూకా కార్యవర్గం, జేఏసీ సమావేశాన్ని నిర్వహించి భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఉద్యోగుల సమస్యలను చర్చలు, సంప్రదింపుల ద్వారా పరిష్కరించడానికే తొలి ప్రాధాన్యత ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించారు.కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం ఉద్యోగుల పెండింగ్ బకాయిల చెల్లింపు, మెమో నంబర్ 57 అమలు వంటి కొన్ని సానుకూల నిర్ణయాలు తీసుకున్నప్పటికీ, పీఆర్సీ, ఐఆర్, పెండింగ్ డీఏలు, సరెండర్ లీవులు తదితర సమస్యలు ఇంకా పరిష్కారం కాకుండా ఉన్నాయని రామసుబ్బయ్య యాదవ్ తెలిపారు.ప్రజాస్వామ్య వ్యవస్థలో చర్చలు, సంప్రదింపుల ద్వారానే సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్యోగ సంఘాల ప్రతినిధులను ఆహ్వానించి, పెండింగ్ సమస్యలపై సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.రాష్ట్ర అధ్యక్షులు, జేఏసీ చైర్మన్ అలపర్తి విద్యాసాగర్, సెక్రటరీ జనరల్ కేఎస్ఎస్ ప్రసాద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.వి. రమణ, కడప జిల్లా అధ్యక్షులు బి. శ్రీనివాసులు ఇచ్చే పిలుపు మేరకు ఎలాంటి కార్యాచరణకైనా ఉద్యోగులు సిద్ధంగా ఉండాలని సమావేశంలో తీర్మానించినట్లు తెలిపారు.
“ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధన విషయంలో రాజీలేని వైఖరితో ముందుకు సాగుతాం. ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే రాష్ట్ర జేఏసీ నాయకత్వం నిర్ణయం మేరకు తదుపరి కార్యాచరణకు సిద్ధంగా ఉంటాం” అని రామసుబ్బయ్య యాదవ్ స్పష్టం చేశారు.సమావేశంలో సెక్రటరీ ప్రమీల, అసోసియేట్ ప్రెసిడెంట్ అశోక్కుమార్, కోశాధికారి సదాశివయ్య, వైస్ ప్రెసిడెంట్ నాగార్జున, వరప్రసాద్, జాయింట్ సెక్రటరీలు మధుసూదన్రెడ్డి, సుజాత, జేఏసీ కో-చైర్మన్లు సలీం (STU), గోపాల్ (RTC), వేణుగోపాల్రెడ్డి, రమణ (PRTU), టి.వి. రెడ్డి (RTC), ఓంకార్, పీరయ్య, నరసింహ, మహేశ్వరయ్య, మహిళా విభాగం సభ్యులు అరుణాదేవి, గంగాదేవి తదితరులు పాల్గొన్నారు.
