SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 04 September 2026, 12:49 am Posted by : SALAM PRODDATUR

ఆధునిక హంగులతో ప్రొద్దుటూరు ఎస్‌డీపీఓ కార్యాలయం

–ప్రజలకు మెరుగైన పోలీస్‌ సేవలే లక్ష్యం..

–దాతల సహకారం అభినందనీయం..

– జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్

సలాం ప్రొద్దుటూరు :

పోలీస్‌ అధికారులు, సిబ్బందికి మెరుగైన పని వాతావరణం కల్పించడంతో పాటు, సమస్యల పరిష్కారం కోసం కార్యాలయానికి వచ్చే ప్రజలకు సౌకర్యవంతమైన వాతావరణం అందించేందుకు ప్రొద్దుటూరు ఎస్‌డీపీఓ కార్యాలయాన్ని ఆధునిక సదుపాయాలతో పునరుద్ధరించారు. పునరుద్ధరించిన కార్యాలయాన్ని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, ఐపీఎస్ గురువారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్‌ శాఖలో మౌలిక వసతులను బలోపేతం చేయడం ద్వారా అధికారులు, సిబ్బంది విధులను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు అవకాశం ఏర్పడుతుందని తెలిపారు. అదే సమయంలో ప్రజలకు వేగవంతమైన, నాణ్యమైన పోలీస్‌ సేవలు అందించేందుకు మెరుగైన వసతులు దోహదపడతాయని పేర్కొన్నారు.

దాతల సహకారం అభినందనీయం

ఎస్‌డీపీఓ కార్యాలయ పునరుద్ధరణకు ప్రొద్దుటూరుకు చెందిన స్వరూప్‌ ఐ హాస్పిటల్స్‌ డాక్టర్‌ వై.వి. స్వరూప్‌కుమార్‌రెడ్డి ప్రధాన ఆర్థిక సహకారం అందించారు. అలాగే వి. జయచంద్రరెడ్డి, డాక్టర్‌ కె.వి.ఆర్‌. ప్రదీప్‌రెడ్డి, డాక్టర్‌ ఎన్‌. నాగార్జున యాదవ్‌, దండపాణి శ్రీనివాసకుమార్‌, నాగూర్‌బాషా, ఎస్‌. నాగిరెడ్డి, చెన్న శ్రీనివాసులు, కె. గంగిరెడ్డి, పి. మహేశ్వర్‌రెడ్డి, పి. రాజేష్‌రెడ్డి, ఎం. శంకర్‌రెడ్డి తదితరులు ఆర్థిక సహకారం అందించారు.

పోలీస్‌ శాఖ మౌలిక వసతుల అభివృద్ధికి దాతలు, ప్రజలు, శ్రేయోభిలాషులు అందిస్తున్న సహకారం అభినందనీయమని ఎస్పీ పేర్కొన్నారు. సమాజంలోని వివిధ వర్గాల భాగస్వామ్యంతో పోలీసులకు మెరుగైన పని పరిస్థితులు కల్పించడంతో పాటు ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించవచ్చన్నారు.

ఏఎస్పీ చొరవతో ఆధునిక రూపం

ప్రొద్దుటూరు ఏఎస్పీ యు. విబు కృష్ణ, ఐపీఎస్ చొరవతో కార్యాలయ పునరుద్ధరణ పనులు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. దాతలు, పోలీస్‌ అధికారులు, సిబ్బంది సమన్వయంతో కార్యాలయానికి ఆధునిక రూపాన్ని తీసుకువచ్చారు.ఈ సందర్భంగా పునరుద్ధరణకు సహకరించిన ప్రధాన దాత డాక్టర్‌ వై.వి. స్వరూప్‌కుమార్‌రెడ్డితో పాటు ఇతర దాతలు, శ్రేయోభిలాషులకు జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో అదనపు ఎస్పీ కె. ప్రకాష్‌బాబు, ప్రొద్దుటూరు ఏఎస్పీ యు. విబు కృష్ణ, సబ్‌ డివిజన్‌ పరిధిలోని సీఐలు, ఎస్‌ఐలు, పోలీస్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.