–జనసేన పార్టీ కార్యాలయంలో మాదాసు మురళి ఆధ్వర్యంలో సంబరాలు
సలాం ప్రొద్దుటూరు:
జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం , ప్రముఖ సినీ నటుడు కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ప్రొద్దుటూరు పట్టణంలోని నందిని క్లాత్ మార్కెట్లో ఉన్న జనసేన పార్టీ కార్యాలయంలో బుధవారం మాదాసు మురళి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం కేక్ కట్ చేసి జనసేన శ్రేణులు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా మాదాసు మురళి మాట్లాడుతూ.. “ఈ రోజు మనందరికీ ఎంతో ప్రత్యేకమైన రోజు. జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను” అన్నారు.పవన్ కళ్యాణ్ తన సినీ ప్రయాణం ద్వారా కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని, అనంతరం ప్రజా జీవితంలోకి ప్రవేశించి తన ఆలోచనలు, సిద్ధాంతాలతో రాజకీయ రంగంలోనూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని పేర్కొన్నారు. ఆయనకు మంచి ఆరోగ్యం, ఆనందం, విజయాలు కలగాలని ఆకాంక్షించారు.ప్రజా జీవితంలో పవన్ కళ్యాణ్ చేపట్టే ప్రతి కార్యక్రమం ప్రజలకు మంచి ఫలితాలను అందించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో ప్రొద్దుటూరు నియోజకవర్గంలో జనసేన పార్టీకి కేటాయించే స్థానాల్లో విజయమే లక్ష్యంగా జనసైనికులు అహర్నిశలు కృషి చేస్తారని, పార్టీ విజయభేరి మోగించే వరకు శ్రమిస్తామని మాదాసు మురళి ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు అల్లం చంద్రశేఖర్, దేవానంద్, జనసైనికులు వరికోటి నాగార్జున, జోడు అఖిల్, వంశీ రెడ్డి, మహమ్మద్, హరీష్, శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
