–బకాయిల వసూళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.. నిర్లక్ష్య సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు
–సెప్టెంబర్ 7 నుంచి 11 వరకు ప్రత్యేక పన్ను వసూలు డ్రైవ్: కమిషనర్ శ్రీనివాస విశ్వనాథ్
సలాం ప్రొద్దుటూరు:
కుళాయి పన్నుల వసూళ్లలో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తప్పవని ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ హెచ్చరించారు. పట్టణంలో కుళాయి పన్నుల వసూళ్ల పరిస్థితిపై బుధవారం తన కార్యాలయంలో వార్డు మౌలిక సౌకర్యాల కార్యదర్శులతో ఆయన సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రొద్దుటూరు పట్టణంలో అధికారికంగా 24,146 కుళాయి కనెక్షన్లు ఉన్నాయని తెలిపారు. వీటి ద్వారా ప్రతి సంవత్సరం సుమారు రూ.3 కోట్ల మేర కుళాయి పన్ను పురపాలక సంఘానికి ఆదాయం రావాల్సి ఉందన్నారు. అయితే సిబ్బంది నిర్లక్ష్యం, మొండి బకాయిదారుల కారణంగా ప్రస్తుతం సుమారు రూ.3.24 కోట్ల కుళాయి పన్ను బకాయిలు పేరుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
95 మంది సిబ్బంది నిరంతర సేవలు
పట్టణంలో 13 ఎలివేటెడ్ లెవెల్ సర్వీస్ రిజర్వాయర్లు (ELSR) ద్వారా తాగునీటి సరఫరా జరుగుతోందని కమిషనర్ తెలిపారు. వాటర్ వర్క్స్ విభాగంలో పంపు ఆపరేటర్లు, వాల్వ్ ఆపరేటర్లు, ఫిట్టర్లు తదితర సుమారు 95 మంది సిబ్బంది నిరంతరం సేవలందిస్తున్నారని వివరించారు.నీటి సరఫరా వ్యవస్థ నిర్వహణ, మరమ్మతులు, సిబ్బంది వేతనాలు తదితర అంశాలపై పురపాలక సంఘం భారీగా నిధులు వెచ్చిస్తోందని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు కూడా బాధ్యతగా స్పందించి కుళాయి పన్నులను సకాలంలో చెల్లించి మున్సిపాలిటీకి సహకరించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు.
సెప్టెంబర్ 7 నుంచి 11 వరకు ప్రత్యేక డ్రైవ్
కుళాయి పన్నులు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పన్నులతో కలిపి పురపాలక సంఘానికి రావాల్సిన మొత్తం బకాయిలు సుమారు రూ.5 కోట్లకు చేరుకున్న నేపథ్యంలో, సెప్టెంబర్ 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ప్రత్యేక పన్ను వసూలు డ్రైవ్ నిర్వహించనున్నట్లు కమిషనర్ తెలిపారు.ఈ ప్రత్యేక డ్రైవ్లో భాగంగా బకాయిదారులను గుర్తించి పన్నులు వసూలు చేయాలని, పన్నులు చెల్లించకుండా నిర్లక్ష్యం చేసే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.“పురపాలక సంస్థ అందించే సేవలు నిరంతరం కొనసాగాలంటే ప్రజల సహకారం ఎంతో అవసరం. పన్నులు సకాలంలో చెల్లించడం ద్వారా మున్సిపాలిటీకి ఆదాయం సమకూరుతుంది. అదే నిధులతో ప్రజలకు మరింత మెరుగైన నీటి సరఫరా, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అవకాశం ఉంటుంది. బకాయిల వసూళ్లలో సిబ్బంది నిర్లక్ష్యాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు” అని కమిషనర్ శ్రీనివాస విశ్వనాథ్ స్పష్టం చేశారు.సమీక్షా సమావేశంలో వాటర్ వర్క్స్ ఏఈ కె. సురేంద్రనాథ్ రెడ్డి, ఏఈ ఎన్. దస్తగిరి, ఏఈ వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.