
–నేరాల నివారణలో ప్రజల సహకారం కీలకం
సలాం ప్రొద్దుటూరు:
మహిళలు, బాలలపై జరిగే నేరాల నివారణకు ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ప్రొద్దుటూరు ఒకటో పట్టణ పోలీసులు సూచించారు. కడప జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు, ప్రొద్దుటూరు ఏఎస్పీ విభూ కృష్ణ ఐపీఎస్ పర్యవేక్షణలో కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమంలో భాగంగా ఎస్సీసీఎన్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మహిళలు, బాలలపై నేరాల నివారణ అంశంపై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రొద్దుటూరు ఒకటో పట్టణ స్టేషన్ సీఐ టీవీ కొండారెడ్డి మాట్లాడుతూ మహిళలు, బాలికలు తమకు ఎదురయ్యే వేధింపులు, బెదిరింపులు, ఇతర సమస్యలను భయపడకుండా వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో పోలీసుల సహాయం పొందాలని తెలిపారు.మహిళలు, బాలలపై జరిగే నేరాలు, మహిళలపై వేధింపులు, బాల్య వివాహాలు, సైబర్ నేరాలు తదితర అంశాలపై విద్యార్థులకు పోలీసులు అవగాహన కల్పించారు. ముఖ్యంగా బాలికలు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండటంతో పాటు, సామాజిక మాధ్యమాలు, ఆన్లైన్ వేదికలను జాగ్రత్తగా వినియోగించాలని సూచించారు.మహిళలు, బాలల రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ అందిస్తున్న వివిధ సేవలను విద్యార్థులకు వివరించారు. ముఖ్యంగా మహిళల భద్రత కోసం పనిచేస్తున్న శక్తి టీమ్ సేవలను అవసరమైన సమయంలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.కార్యక్రమంలో ప్రొద్దుటూరు ఒకటో పట్టణ అండర్ గ్రౌండ్ పోలీస్ స్టేషన్ హెచ్సీ జి. రాంబాబు, డబ్ల్యూపీసీ ఎస్. సరోజ, డబ్ల్యూపీసీ బి. శివలక్ష్మి, కడప మహిళా పోలీస్ స్టేషన్ హెచ్ సి. నాగేష్ కుమార్, ప్రొద్దుటూరు శక్తి టీమ్ పీసీ డి. రాజేంద్ర పాల్గొన్నారు.కళాశాల ప్రిన్సిపాల్ ఎం. చంద్ర ఓబుల్ రెడ్డి, ఇంగ్లీష్ లెక్చరర్ వి.వి.ఎన్. కిషోర్ కార్యక్రమంలో పాల్గొని పోలీస్ శాఖ చేపడుతున్న అవగాహనా కార్యక్రమాలను అభినందించారు.మహిళలు, బాలల భద్రతకు సంబంధించిన అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడం ద్వారా నేరాల నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవడంతో పాటు, పోలీసులకు ప్రజలు సహకరించాల్సిన అవసరాన్ని కార్యక్రమంలో వివరించారు.