SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 30 August 2026, 9:50 pm Posted by : SALAM PRODDATUR

గంజాయి రహిత సమాజం నిర్మిద్దాం–సి ఐ కొండా రెడ్డి

 

 

–యువత భవిష్యత్తును కాపాడుదాం.. మాదకద్రవ్యాలకు దూరంగా ఉందాం

–ప్రజల భాగస్వామ్యంతో గంజాయిని నిర్మూలిద్దాం – పోలీసులకు సహకరిద్దాం.

–ఈశ్వర్‌రెడ్డి నగర్‌లో పోలీసుల అవగాహనా సదస్సు

 

సలాం  ప్రొద్దుటూరు:

గంజాయి, ఇతర మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రొద్దుటూరు ఒకటో పట్టణ పోలీసులు ఈశ్వర్‌రెడ్డి నగర్‌లో ప్రత్యేక అవగాహనా సదస్సు నిర్వహించారు.కడప జిల్లా ఎస్పీ  నచికేత్ విశ్వనాథ్, ఐపీఎస్ ఆదేశాల మేరకు, ప్రొద్దుటూరు ఏఎస్పీ  విభూ కృష్ణ, ఐపీఎస్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ.. గంజాయి ఒక వ్యక్తి ఆరోగ్యానికే కాకుండా కుటుంబం, సమాజం, ముఖ్యంగా యువత భవిష్యత్తుకు తీవ్ర నష్టం కలిగిస్తుందని తెలిపారు. మాదకద్రవ్యాలకు అలవాటు పడటం వల్ల విద్య, ఉద్యోగం, కుటుంబ సంబంధాలు, సామాజిక జీవితం దెబ్బతినే ప్రమాదం ఉందని వివరించారు.యువత మాదకద్రవ్యాలకు ఆకర్షితులు కాకుండా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. పిల్లల ప్రవర్తనలో అనుమానాస్పద మార్పులు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వారితో స్నేహపూర్వకంగా మాట్లాడి సరైన మార్గంలో నడిపించాలని కోరారు.అలాగే గంజాయి కొనుగోలు, విక్రయాలు, వినియోగం లేదా అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు సూచించారు. సమాచారం అందించే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని అధికారులు తెలిపారు.“గంజాయికి నో చెప్పండి.. యువత భవిష్యత్తును కాపాడండి” అని పిలుపునిస్తూ, గంజాయిరహిత ప్రాంతాల నిర్మాణానికి ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.ప్రజల భాగస్వామ్యంతోనే మాదకద్రవ్యాల నిర్మూలన సాధ్యమవుతుందని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పోలీసులు పిలుపునిచ్చారు.