SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 29 August 2026, 12:13 am Posted by : SALAM PRODDATUR

శెట్టివారిపల్లిలో 5 లక్షల లీటర్ల నీటి ట్యాంక్‌కు శంకుస్థాపన

 

–మైదుకూరు తాగునీటి సమస్యల పరిష్కారానికి మరో ముందడుగు

 

సలాం ప్రొద్దుటూరు –  మైదుకూరు:

మైదుకూరు పురపాలిక పరిధిలో తాగునీటి వసతుల మెరుగుదలకు మరో ముందడుగు పడింది. ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ కృషితో అమృత్ 2.0 పథకంలో భాగంగా శెట్టివారిపల్లి గ్రామంలో 5 లక్షల లీటర్ల సామర్థ్యంతో నిర్మించనున్న నీటి ట్యాంక్‌కు గ్రామ పెద్దలు శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు.ఈ ట్యాంక్ నిర్మాణం పూర్తయితే మైదుకూరు పురపాలిక పరిధిలోని ప్రజలకు తాగునీటి సరఫరా మరింత మెరుగుపడనుంది. ముఖ్యంగా వేసవి కాలంలో, నీటి కొరత ఏర్పడే సమయాల్లో ప్రజలకు నిరంతర తాగునీటిని అందించేందుకు ఈ ట్యాంక్ కీలకంగా ఉపయోగపడుతుందని స్థానికులు తెలిపారు.మైదుకూరు పట్టణం, పరిసర ప్రాంతాల్లో తాగునీటి సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన తాగునీటి సౌకర్యాలు అందించేందుకు చేపడుతున్న చర్యలపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.శెట్టివారిపల్లిలో భారీ సామర్థ్యంతో నీటి ట్యాంక్ నిర్మాణానికి చర్యలు తీసుకున్న ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్‌కు గ్రామ పెద్దలు, స్థానిక ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. తాగునీటి వసతుల విస్తరణతో రానున్న రోజుల్లో నీటి సరఫరా మరింత సులభతరం కానుందని ఆశాభావం వ్యక్తం చేశారు.