SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 27 August 2026, 11:52 pm Posted by : SALAM PRODDATUR

మోదీతో ప్రొద్దుటూరు గౌతమి విద్యార్థినుల ముచ్చట్!

 

 

–‘ఖేలో ఇండియా’ ప్రత్యేక వీడియో కాన్ఫరెన్స్‌లో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థినులు

 

సలాం   ప్రొద్దుటూరు:

జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని గౌతమి మహిళా ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినులకు అరుదైన అవకాశం లభించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించిన ‘ఖేలో ఇండియా డైలాగ్ – ఖేల్ కీ బాత్, పీఎం మోదీ కే సాత్’ ప్రత్యేక వీడియో కాన్ఫరెన్స్‌లో కళాశాల విద్యార్థినులు గురువారం ఉత్సాహంగా పాల్గొన్నారు.

 

క్రీడలు.. ఫిట్‌నెస్.. యువత పాత్రపై మోదీ సందేశం

 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ క్రీడలు, శారీరక దృఢత్వం, ఆరోగ్యకరమైన జీవనశైలి, దేశ నిర్మాణంలో యువత పాత్రపై చేసిన ప్రసంగాన్ని విద్యార్థినులు ఎంతో ఆసక్తిగా వీక్షించారు. క్రీడలు కేవలం పోటీలకే పరిమితం కాకుండా విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని కార్యక్రమంలో వివరించారు.

 

యువతకు పలు కార్యక్రమాలపై అవగాహన

 

ఈ సందర్భంగా ‘వికసిత్ భారత్–మై భారత్’ కార్యక్రమంలో రిజిస్ట్రేషన్, దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం, ‘నషా ముక్త్ భారత్’ ఉద్యమం తదితర అంశాలపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు.యూత్ లీడర్ బసటి జీవన్ కుమార్ మాట్లాడుతూ ఆయా కార్యక్రమాల్లో యువత ఎలా నమోదు చేసుకోవాలి, సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎలా భాగస్వాములు కావాలి అనే అంశాలపై విద్యార్థులకు మార్గదర్శకాలు అందించారు.

 

క్రీడల్లో రాణించాలంటే క్రమశిక్షణే కీలకం

 

జాతీయస్థాయి టెన్నిస్ బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ఆర్.కే. పార్టీ శంకర రెడ్డి విద్యార్థినులతో మాట్లాడుతూ క్రీడల్లో ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే నిరంతర సాధన, క్రమశిక్షణ, శారీరక దృఢత్వం, ఆత్మవిశ్వాసం, పట్టుదల అత్యంత అవసరమని తెలిపారు.ప్రతి విద్యార్థి విద్యతోపాటు కనీసం ఒక క్రీడలో చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. క్రీడల ద్వారా ఆరోగ్యంతో పాటు టీమ్‌వర్క్, నాయకత్వ లక్షణాలు, సమయపాలన అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు.

 

మహిళా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించాలి

 

కరస్పాండెంట్ బాబమ్మ మాట్లాడుతూ మహిళా విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడం ద్వారా వారి ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, నిర్ణయ సామర్థ్యాలు మరింత బలోపేతం అవుతాయని అన్నారు. విద్యకు ఎంత ప్రాధాన్యత ఇస్తామో క్రీడలకు కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వడం సంస్థ లక్ష్యమని తెలిపారు.

 

 

ప్రతిభకు సంస్థ అండగా ఉంటుంది

 

 

చైర్మన్లు నాగూర్, రవీంద్రారెడ్డి మాట్లాడుతూ జాతీయస్థాయిలో రాణిస్తున్న క్రీడాకారుల అనుభవాలు విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని అన్నారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచే ప్రతి విద్యార్థికి సంస్థ తరఫున పూర్తి ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు.“ఆరోగ్యకరమైన యువతే బలమైన భారతదేశానికి పునాది” అని పేర్కొంటూ, క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, సమయపాలన, టీమ్‌వర్క్, నాయకత్వ సామర్థ్యాలను పెంపొందిస్తాయని వివరించారు.

 

 

వికసిత్ భారత్‌లో యువతదే కీలక పాత్ర

 

 

డైరెక్టర్ శైలుషా మాట్లాడుతూ వికసిత్ భారత్ నిర్మాణంలో యువత కీలకపాత్ర పోషించాలని ఆకాంక్షించారు. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో విద్యార్థుల భాగస్వామ్యం అత్యంత ముఖ్యమని అన్నారు.ప్రిన్సిపల్ డాక్టర్ ఎం. రామసుబ్బమ్మ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో గౌతమి విద్యార్థినులు పాల్గొనడం గర్వకారణమని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో దేశభక్తి, క్రీడా స్ఫూర్తి, సామాజిక బాధ్యతను పెంపొందిస్తాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థినులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.