
–ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి జన్మదిన వేడుకలకు ముందస్తు కార్యక్రమాలు
సలాం ప్రొద్దుటూరు – కడప:
కడప పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని అవినాష్ యూత్ ఆధ్వర్యంలో ముందస్తు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.కడప నగరంలోని అర్బన్ రెసిడెన్షియల్ హాస్టల్లో విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి, అనంతరం వారికి భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. విద్యార్థులతో ఆత్మీయంగా మమేకమైన నిర్వాహకులు, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమాలతో నిర్వహించడం ఆనందంగా ఉందని తెలిపారు.అనంతరం కడపలోని పెద్ద దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని, ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం లభించాలని ప్రార్థనలు చేశారు.ఈ సందర్భంగా అవినాష్ యూత్ నాయకులు రహీమ్ మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిగా వైఎస్ అవినాష్ రెడ్డి నిలుస్తున్నారని అన్నారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా కార్యక్రమాలు నిర్వహించడం తమకు ఎంతో సంతృప్తినిచ్చిందని తెలిపారు.ప్రజల కోసం.. ప్రజల మధ్య.. ప్రజల మనిషిగా నిలిచిన అవినాష్ రెడ్డి గారికి ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు అని రహీమ్ ఆకాంక్షించారు.

