SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 26 August 2026, 1:07 am Posted by : SALAM PRODDATUR

ఇష్క్-ఏ-రసూల్‌తో మార్మోగిన ప్రొద్దుటూరు.. ఘనంగా మిలాద్ ఉన్ నబీ ﷺ

 

 

సలాం ప్రొద్దుటూరు:

మహమ్మద్ ప్రవక్త హజ్రత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహించే పవిత్ర మిలాద్ ఉన్ నబీ ﷺ వేడుకలు ప్రొద్దుటూరు పట్టణంలో మంగళవారం రాత్రి ఇస్లామిక్ సంప్రదాయాలు, ఆధ్యాత్మిక వాతావరణం నడుమ ఘనంగా జరిగాయి. అంజుమన్ అహ్లే ఇస్లాం కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు ప్రొద్దుటూరుతో పాటు పరిసర ప్రాంతాల నుంచి వేలాది మంది తరలివచ్చారు.కులమతాలకు అతీతంగా ప్రజలు పాల్గొనడంతో ఆసరే షరీఫ్ ప్రాంతం మతసామరస్యం, సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలిచింది. సుందరాచార్యుల వీధి, ఖాదర్ హుస్సేన్ వీధి, మౌలానా ఆజాద్ వీధి, ఆసరే షరీఫ్ వీధి, దర్గా బజార్ వరకు పండుగ వాతావరణం నెలకొంది. మిలాద్, ఉర్సు సందర్భంగా ఏర్పాటు చేసిన దుకాణాల వద్ద మహిళలు, చిన్నారులు సందడి చేశారు.

నాత్‌లు.. ఖసీదాలు.. దరూద్ షరీఫ్‌లతో ఆధ్యాత్మిక శోభ

ఇషా నమాజ్ అనంతరం ఆసరే షరీఫ్ ప్రాంగణంలో నాత్-ఏ-షరీఫ్, ఖసీదా, దరూద్ షరీఫ్ కార్యక్రమాలు నిర్వహించారు. నాత్‌ల గానంతో పాటు దరూద్ షరీఫ్ పఠనాలతో ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పవిత్ర నామస్మరణతో పరిసర ప్రాంతాలు మార్మోగాయి.తరతరాలుగా కొనసాగుతున్న మిలాద్ ఉన్ నబీ సంప్రదాయాన్ని పాటిస్తూ చిన్నారులు, మహిళలు, వృద్ధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పలువురు భక్తులు రాత్రంతా జాగరణ చేసి ప్రార్థనలు నిర్వహిస్తూ పవిత్ర రాత్రిని భక్తిశ్రద్ధలతో గడిపారు.

 

ప్రవక్త ముబారక్ జ్ఞాపికల జియారత్‌కు విశేష ప్రాధాన్యం

 

రాత్రి సుమారు 11.30 గంటల సమయంలో ప్రొద్దుటూరు ఆస్తాన-ఏ-జాహురియా పీఠాధిపతులు సయ్యద్ షా ముబీన్ హుస్సేనీ ఖాద్రీ సాహెబ్, మతీన్ హుస్సేనీ ఖాద్రీ సాహెబ్ ఆధ్వర్యంలో మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పవిత్ర ముయే ముబారక్   జియారత్ నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రవక్త ముయే ముబారక్‌ ను పవిత్ర నీటి పాత్ర లో  ఏర్పాటు చేసి జియారత్ కోసం ఉంచారు. భక్తులు క్రమశిక్షణతో జియారత్ చేసుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఫజ్ర్ నమాజ్ వరకు జియారత్ కొనసాగుతుందని పీఠాధిపతులు తెలిపారు.

ఇస్లామిక్ సంప్రదాయానికి అద్దం పట్టిన వేడుకలు

 

మిలాద్ ఉన్ నబీ ﷺ వేడుకలు ప్రొద్దుటూరులోని ఇస్లామిక్ ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంప్రదాయాల వైభవాన్ని చాటిచెప్పాయి. ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధించిన శాంతి, ప్రేమ, కరుణ, సోదరభావం, మానవతా విలువలను స్మరించుకుంటూ భక్తులు వేడుకల్లో పాల్గొన్నారు.వేలాది మంది భక్తుల సమక్షంలో సాగిన మిలాద్ ఉన్ నబీ వేడుకలు భక్తి, సంప్రదాయం, సౌభ్రాతృత్వం సమ్మిళితమైన ఆధ్యాత్మిక ఉత్సవంగా నిలిచాయి. ఆసరే షరీఫ్ పరిసరాల్లో రాత్రంతా నెలకొన్న ఆధ్యాత్మిక వాతావరణం ప్రొద్దుటూరు ఇస్లామిక్ సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించింది.