SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 21 August 2026, 10:19 pm Posted by : SALAM PRODDATUR

జిల్లాలో నాలుగు రోజులు ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలు

 

 

–అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. శ్రీధర్ చెరుకూరి

 

సలాం ప్రొద్దుటూరు – కడప:

ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ ప్రక్రియ (ఎస్‌ఐఆర్‌)లో భాగంగా జిల్లాలో ఈ నెల 22, 23, 29, 30 తేదీల్లో ప్రత్యేక ప్రచార, ఓటరు నమోదు శిబిరాలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. శ్రీధర్ చెరుకూరి తెలిపారు.రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈ శిబిరాలను నిర్వహించాలని సంబంధిత ఎన్నికల అధికారులను ఆదేశించారు. నాలుగు రోజుల పాటు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రతి పోలింగ్ కేంద్రంలో బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌ఓలు), రాజకీయ పార్టీల బూత్ స్థాయి ఏజెంట్లు అందుబాటులో ఉంటారని తెలిపారు.ఈ సందర్భంగా ముసాయిదా ఓటరు జాబితాలు, ఏఎస్‌డీడీ జాబితాలను పరిశీలించడంతో పాటు, ఓటర్ల సందేహాలను నివృత్తి చేసి అవసరమైన దరఖాస్తులను స్వీకరించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

 

18–19 ఏళ్ల యువ ఓటర్ల నమోదుకు ప్రాధాన్యం

 

ప్రత్యేక శిబిరాలను ముఖ్యంగా 18–19 ఏళ్ల యువ ఓటర్ల నమోదుకు వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. ముసాయిదా ఓటరు జాబితాలో పేర్లు నమోదు కాని అర్హులైన పౌరులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరారు. ఇందుకోసం అవసరమైన ఫారం-6, ఫారం-7, ఫారం-8, ఫారం-8ఏ దరఖాస్తులను పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.

 

విస్తృత ప్రచారం.. ఆకస్మిక తనిఖీలు

 

ప్రత్యేక శిబిరాలపై జిల్లాస్థాయి నుంచి పోలింగ్ కేంద్రాల స్థాయి వరకు విస్తృత ప్రచారం నిర్వహించాలని, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు స్థానిక ప్రచార మార్గాల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు.శిబిరాల నిర్వహణను జిల్లా ఎన్నికల అధికారి స్వయంగా పర్యవేక్షించడంతో పాటు, ఎన్నికల అధికారులు పోలింగ్ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేయాలని ఆదేశించారు. శిబిరాల సమయంలో బీఎల్‌ఓలు గైర్హాజరైతే తీవ్రంగా పరిగణించి సంబంధిత అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.

 

ఆగస్టు 30 వరకు క్లెయిమ్స్, అభ్యంతరాల స్వీకరణ

 

ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణలో భాగంగా జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు క్లెయిమ్స్, అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతున్నందున అర్హులైన ప్రతి ఒక్కరూ తమ పేరు ఓటరు జాబితాలో ఉందో లేదో పరిశీలించుకోవాలని కలెక్టర్ సూచించారు. పేరు లేకపోతే నిర్ణీత దరఖాస్తు ద్వారా నమోదు చేసుకోవాలని, ఓటరు జాబితా సవరణ ప్రక్రియను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.