SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 20 August 2026, 7:22 pm Posted by : SALAM PRODDATUR

ఎమ్మెల్యేలు మారినా.. దోమలు పోలేదు.. ఇర్ఫాన్ బాషా

–ప్రభుత్వాల వైఫల్యమే ప్రొద్దుటూరు ప్రజల దోమల కష్టాలకు కారణం

 సలాం ప్రొద్దుటూరు:

ప్రొద్దుటూరులో దోమల సమస్యపై కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఇర్ఫాన్‌ బాషా అధికార పార్టీపై రాజకీయ విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్యేలు, ప్రభుత్వాలు మారుతున్నా ప్రజలు ఎదుర్కొంటున్న దోమల సమస్యకు మాత్రం శాశ్వత పరిష్కారం చూపలేకపోయారని ఆయన ఆరోపించారు.ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత 50 ఏళ్లుగా ప్రొద్దుటూరు రాజకీయాల్లో ఎన్నో మార్పులు వచ్చినా, దోమల బెడద మాత్రం ప్రజలను వీడలేదని విమర్శించారు. మున్సిపాలిటీ పరిధిలో అన్ని వార్డుల లో  దోమల నియంత్రణకు సరిపడా యంత్రాలు, సిబ్బంది, మౌలిక వసతులు అందుబాటులో లేకపోవడం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు.అరకొర యంత్రాలతో ఫాగింగ్‌ నిర్వహిస్తూ దోమల నియంత్రణ సాధించామని చెప్పడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని ఇర్ఫాన్‌ బాషా వ్యాఖ్యానించారు. దోమలను పూర్తిగా నిర్మూలించడం సాధ్యం కాకపోయినా, శాస్త్రీయ పద్ధతుల్లో వాటి సంఖ్యను గణనీయంగా తగ్గించేందుకు అవసరమైన చర్యలు చేపట్టవచ్చన్నారు.మురుగు కాలువల నిర్వహణ, నిల్వ నీటి తొలగింపు, ఫాగింగ్‌, యాంటీ లార్వా కార్యక్రమాలను నిరంతరం చేపట్టడంతో పాటు అవసరమైన సిబ్బంది, ఆధునిక యంత్రాలను సమకూర్చాలని ఆయన డిమాండ్‌ చేశారు. ప్రజారోగ్య సమస్యలను రాజకీయ ప్రచారానికి పరిమితం చేయకుండా శాశ్వత పరిష్కారాలపై దృష్టి పెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.

కాంగ్రెస్‌కు అవకాశం ఇస్తే..

ప్రొద్దుటూరు ప్రజలు కాంగ్రెస్‌ పార్టీకి అవకాశం ఇస్తే దోమల నియంత్రణను ప్రత్యేక ప్రాధాన్యత అంశంగా తీసుకుని సమగ్ర కార్యాచరణ అమలు చేస్తామని ఇర్ఫాన్‌ బాషా హామీ ఇచ్చారు. ప్రజలకు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించేందుకు అవసరమైన మౌలిక వసతులను బలోపేతం చేస్తామని తెలిపారు.ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా దోమల సమస్యను రాజకీయ అంశంగా ముందుకు తెచ్చిన ఇర్ఫాన్‌ బాషా వ్యాఖ్యలు ప్రొద్దుటూరు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.