SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 18 August 2026, 11:12 pm Posted by : SALAM PRODDATUR

భూ వ్యవహారాలపై సమగ్ర దర్యాప్తు చేయాలి

 

–ఆరోపణలపై చట్టపరంగా విచారణ జరపాలని వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ నల్లబోతుల నాగరాజు డిమాండ్

 

సలాం   ప్రొద్దుటూరు:

పట్టణంలో విలువైన భూములకు సంబంధించి అనుమానాస్పదంగా ఉన్న వ్యవహారాలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ నల్లబోతుల నాగరాజు కోరారు. మంగళవారం ప్రొద్దుటూరులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.శ్రీనివాస్‌నగర్‌లోని ఓ విలువైన భూమికి సంబంధించిన వ్యవహారంపై పలు సందేహాలు ఉన్నాయని నాగరాజు తెలిపారు. అధికారుల సీల్లు, సంతకాల దుర్వినియోగానికి సంబంధించిన కేసులో హాజరయ్య అనే వ్యక్తి పాత్రపై ఇప్పటికే ఆరోపణలు, కేసు నమోదు అంశాలు ఉన్నాయని పేర్కొంటూ, ఈ వ్యవహారంపై దర్యాప్తు సంస్థలు పూర్తి స్థాయిలో విచారణ జరపాలని కోరారు.భూమికి సంబంధించిన పత్రాలు, రిజిస్ట్రేషన్ రికార్డులు, లావాదేవీలు, సంబంధిత వ్యక్తుల మధ్య జరిగిన కమ్యూనికేషన్ తదితర అంశాలను చట్టబద్ధంగా పరిశీలించాలని ఆయన సూచించారు. భూ వ్యవహారంలో ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించినట్లు దర్యాప్తులో తేలితే, సంబంధిత చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు.హాజరయ్య అరెస్టు నేపథ్యంలో దర్యాప్తులో స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంటున్న నగదు, పత్రాలు, ఇతర ఆధారాలపై స్పష్టత ఇవ్వాలని నాగరాజు కోరారు. పోలీస్‌స్టేషన్‌లో ఉన్న సమయంలో ఎవరైనా అధికారులపై ప్రభావం చూపేందుకు ప్రయత్నించారా అనే అంశంపైనా విచారణ జరపాలని ఆయన అభిప్రాయపడ్డారు.అలాగే, పోలీస్‌స్టేషన్‌లో హాజరయ్యను కలిసినట్లు చెబుతున్న వ్యక్తుల వివరాలను కూడా దర్యాప్తులో భాగంగా పరిశీలించి, వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని నాగరాజు కోరారు.గత ప్రభుత్వ హయాంలో భూ వ్యవహారాలకు సంబంధించి అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై కూడా సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ అంశంపై రాజకీయ ఆరోపణలకు అతీతంగా, రికార్డులు మరియు ఆధారాల ఆధారంగా వాస్తవాలను నిర్ధారించాలని సూచించారు.

కస్టడీ విచారణకు డిమాండ్

ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న హాజరయ్యను, దర్యాప్తు అవసరాల దృష్ట్యా చట్టపరమైన విధానాలను అనుసరించి పోలీస్ కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందని నాగరాజు అన్నారు. భూ పత్రాలు, అధికారిక రికార్డులు, ఆర్థిక లావాదేవీలు, సంతకాలు–సీల్స్‌కు సంబంధించిన అంశాలను పూర్తిగా పరిశీలించాలని కోరారు.ఈ వ్యవహారంపై త్వరలో రాష్ట్ర హోంమంత్రిని కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు నాగరాజు తెలిపారు.