SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 17 August 2026, 8:00 pm Posted by : SALAM PRODDATUR

ఎలక్టోరల్ ప్రిపరేషన్ సక్రమంగా నిర్వహించాలి

 

 

–సిబ్బందికి మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ ఆదేశాలు

 

సలాం ప్రొద్దుటూరు:

భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎలక్టోరల్ ప్రిపరేషన్ ప్రక్రియను పకడ్బందీగా, ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా నిర్వహించాలని మున్సిపల్ కమిషనర్, అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాధ్ సిబ్బందిని ఆదేశించారు.స్థానిక పురపాలక సంఘం సమీక్షా సమావేశ మందిరంలో వార్డు అడ్మిన్ సెక్రటరీలు, వార్డు ప్లానింగ్ సెక్రటరీలతో ఆయన సమావేశమై డ్రాఫ్ట్ ఎలక్టోరల్ ప్రిపరేషన్‌పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటర్ల వివరాల సేకరణ, డేటా నమోదు తదితర అంశాలపై సిబ్బందికి పలు సూచనలు చేశారు.ప్రతి సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు సంబంధించిన సమాచారాన్ని ఆగస్టు 28లోపు సేకరించి, నిర్దేశిత ఇన్‌పుట్ డేటా షీట్లలో నమోదు చేయాలని కమిషనర్ సూచించారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన సమాచారాన్ని సిబ్బంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోరాదని స్పష్టం చేశారు.ఎన్నికల సంఘం నిర్ణయించిన ఎలక్టోరల్ డేటాబేస్‌కు జనవరి 1, 2026ను అర్హత తేదీగా పరిగణిస్తున్నందున, ఓటర్ల వివరాల సేకరణలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని శ్రీనివాస విశ్వనాధ్ సూచించారు. ప్రతి వివరాన్ని క్షుణ్ణంగా పరిశీలించి నమోదు చేయాలని, డేటాలో తప్పులు చోటుచేసుకోకుండా బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సిబ్బందికి ఆదేశించారు.ఈ సమీక్షా సమావేశంలో టౌన్ ప్లానింగ్ అధికారి జి. చంద్రమోహన్ పాల్గొన్నారు.