SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 15 August 2026, 8:51 pm Posted by : SALAM PRODDATUR

ప్రేమ వ్యవహారంలో యువకుడిపై దాడి.. 11 మంది అరెస్ట్

 

– రూరల్ సీఐ ఎం. నాగభూషణ్

 

సలాం ప్రొద్దుటూరు:

ప్రేమ వ్యవహారానికి సంబంధించి యువకుడిపై దాడి చేసిన 11 మందిని అరెస్ట్ చేసినట్లు ప్రొద్దుటూరు రూరల్ సీఐ ఎం. నాగభూషణ్ తెలిపారు. శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన కేసు వివరాలను వెల్లడించారు.సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 13న స్వప్న బార్ అండ్ రెస్టారెంట్ వద్ద లోకేశ్వర్ రెడ్డి అనే యువకుడిపై ప్రేమ వ్యవహారం విషయంలో కొంతమంది యువకులు కర్రలు, రాళ్లు, ఖాళీ బీర్ బాటిళ్లతో దాడి చేసి గాయపరిచారు. ఘటనపై ఫిర్యాదు అందడంతో రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.దర్యాప్తులో దాడిలో పాల్గొన్న 11 మందిని గుర్తించి అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో చిన్ని వెంకటగారి సాయి ప్రతాప్ (21), చిన్ని వెంకటగారి హరిప్రసాద్ (29), పెద్దమంగళ మదన్ మోహన్ (20), యామారపు వినయ్ కుమార్ (20), చాగలమారి నూర్ మహమ్మద్ (22), జానపాటి గోవర్ధన్ (22), పాలెం భువనేష్ (18), గీద్దలూరు యశ్వంత్ శివ (19), మిద్దె నారాయణస్వామి (28), గుజ్జల అంజి (23), గంగారి ప్రవీణ్ (28) ఉన్నట్లు వెల్లడించారు.అరెస్ట్ అయిన వారిలో ఇద్దరు మినహా మిగిలిన వారంతా విద్యార్థులేనని సీఐ తెలిపారు. వారిలో కొందరు CBIT, SRIT ఇంజినీరింగ్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఉన్నట్లు చెప్పారు. నిందితుల వద్ద నుంచి దాడికి ఉపయోగించిన కట్టెలు, రాళ్లు, ఖాళీ బీర్ బాటిళ్లతో పాటు మూడు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.ఘటన అనంతరం అదుపులోకి తీసుకున్న విద్యార్థులకు గంజాయి వినియోగంపై పరీక్షలు నిర్వహించగా, ఎలాంటి గంజాయి తీసుకున్నట్లు నిర్ధారణ కాలేదని సీఐ నాగభూషణ్ తెలిపారు.

తక్షణమే స్పందించిన రూరల్ పోలీసులు

తన ఆదేశాల మేరకు ఎస్‌ఐలు, బ్లూకోర్టు సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారని సీఐ తెలిపారు. పోలీసులు సకాలంలో స్పందించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారకుండా, పెద్ద ఘర్షణ జరగకుండా అడ్డుకున్నామని చెప్పారు.ఈ ఘటనలో మరికొందరి ప్రమేయంపై దర్యాప్తు కొనసాగుతోందని, ఆధారాల ఆధారంగా వారిపైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ స్పష్టం చేశారు. అరెస్ట్ చేసిన నిందితులను కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు.

యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి

యువత చెడు వ్యసనాలు, అసాంఘిక కార్యకలాపాలు, వివాదాలు, ఘర్షణలకు దూరంగా ఉండాలని సీఐ నాగభూషణ్ సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తన, స్నేహాలు, దైనందిన కార్యకలాపాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు.పిల్లల్లో అనుమానాస్పద మార్పులు కనిపిస్తే వెంటనే గుర్తించి అవసరమైతే కౌన్సెలింగ్ ఇప్పించాలని సూచించారు. మద్యం, గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాల వినియోగం, అక్రమ కార్యకలాపాలకు సంబంధించిన ఆధారాలు వెలుగులోకి వస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.ఈ విలేకరుల సమావేశంలో ఎస్‌ఐలు కె.సి. రాజు, కె. శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.