
సలాం ప్రొద్దుటూరు:
80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన తిరంగా ర్యాలీ దేశభక్తి, జాతీయ సమైక్యతకు ప్రతీకగా నిలిచింది. శ్రీనివాసనగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి శివాలయం సర్కిల్ వరకు సుమారు 100 మీటర్ల భారీ జాతీయ జెండాతో నిర్వహించిన ఈ ర్యాలీ ప్రజల్లో స్ఫూర్తిని నింపింది.
జాతీయ జెండాలను చేతబూని “భారత్ మాతాకీ జై”, “వందే మాతరం”, “జై హింద్” వంటి దేశభక్తి నినాదాలతో వైద్యులు, ఆరోగ్య సిబ్బంది ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. జాతీయ జెండా దేశ గౌరవానికి ప్రతీక అని, ప్రతి ఒక్కరిలో దేశభక్తి, జాతీయ సమైక్యత, ఐక్యతా భావాలను పెంపొందించడమే తిరంగా ర్యాలీ ఉద్దేశమని ఉప జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డా. గీత తెలిపారు.
స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, దేశ ఐక్యతను కాపాడేందుకు ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలని ఆమె పిలుపునిచ్చారు. యువతతో పాటు అన్ని వర్గాల ప్రజలు దేశభక్తి స్ఫూర్తిని చాటే కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు డా. నజీర్ భాష, డా. నాగార్జున, డా. భరత్ నారాయణ, డా. మురళీకృష్ణారెడ్డి, డా. మానస, డా. సుప్రియ, డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, హెచ్ఈ సుబ్బరాయుడు, హెల్త్ సూపర్వైజర్ అరుంధతి, హెల్త్ అసిస్టెంట్లు జయపాల్, క్రిస్టఫర్, సీవోలు సుబ్బారెడ్డి, శ్రీదేవి, నాగజ్యోతి తదితరులు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

