–ప్రొద్దుటూరులో అన్నా క్యాంటీన్ సేవలను మరింత విస్తృతం చేస్తాం– మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్
సలాం ప్రొద్దుటూరు :
నిరుపేదలు, సామాన్య ప్రజలకు అందుబాటు ధరలో రుచికరమైన, తృప్తికరమైన అల్పాహారం, భోజనం అందించాలనే ప్రభుత్వ సంకల్పాన్ని ప్రొద్దుటూరు పట్టణంలో మరింత సమర్థవంతంగా అమలు చేస్తామని మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ తెలిపారు.
అన్నా క్యాంటీన్ కేవలం భోజనం అందించే కేంద్రం మాత్రమే కాకుండా, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే ప్రజలకు ఆత్మీయత, గౌరవం, భరోసా అందించే ప్రజా సేవా కేంద్రంగా నిలవాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. నాణ్యమైన ఆహారం, పరిశుభ్రమైన వాతావరణం, మెరుగైన సేవల ద్వారా ప్రజల్లో అన్నా క్యాంటీన్పై మరింత నమ్మకం పెంచేందుకు చర్యలు చేపడతామని తెలిపారు.
“అన్నా క్యాంటీన్ ఉండగా స్టార్ హోటల్ దండగ” అనే స్థాయిలో ప్రజలకు ఉపయోగపడేలా సేవలను తీర్చిదిద్దాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నామని కమిషనర్ శుక్రవారం పేర్కొన్నారు. క్యాంటీన్ సేవలు, ప్రయోజనాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి మరింత మంది వినియోగించుకునేలా అవగాహన కల్పిస్తామని తెలిపారు.
ప్రజల సానుకూల స్పందన (People Positive Perception) సాధించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తామని, ప్రజల అభిప్రాయాలు, సూచనలను పరిగణనలోకి తీసుకుని సేవలను మెరుగుపరుస్తామని చెప్పారు. అన్నా క్యాంటీన్ పనితీరుపై త్వరలో సమీక్ష నిర్వహించి, అవసరమైన మరిన్ని చర్యలు చేపడతామని కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ తెలిపారు.
పేదవాడి ఆకలి తీర్చడం ఒక సేవ మాత్రమే కాకుండా సమాజం పట్ల బాధ్యత అనే ఆలోచనతో అన్నా క్యాంటీన్ను మరింత ప్రజాదరణ పొందేలా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని ఆయన స్పష్టం చేశారు.