సలాం ప్రొద్దుటూరు:
గ్రామీణ ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా సేవలందిస్తూ అంతర్జాతీయ స్థాయి శిక్షణ కార్యక్రమానికి ఎంపికై కడప జిల్లా ఖ్యాతిని చాటుతున్న షేక్ జవహర్ మునీర్ ను మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి బుధవారం ఘనంగా సన్మానించి అభినందించారు.
ప్రొద్దుటూరు మండలం గోపవరం పంచాయతీ లింగారెడ్డినగర్ మండల ప్రజా పరిషత్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న షేక్ జవహర్ మునీర్, ఫిన్లాండ్లో ఈ నెల 17 నుంచి 26వ తేదీ వరకు నిర్వహించనున్న FLN శిక్షణ కార్యక్రమానికి ఎంపికయ్యారు. విద్యార్థుల్లో ప్రాథమిక అక్షరాస్యత, అభ్యాస సామర్థ్యం, సంఖ్యా నైపుణ్యాలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా మల్లెల లింగారెడ్డి ఆమెకు శాలువా కప్పి ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తూ అంతర్జాతీయ స్థాయి శిక్షణకు ఎంపిక కావడం ఎంతో గర్వించదగ్గ విషయమని అన్నారు.
ఒక ఉపాధ్యాయురాలి ప్రతిభ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం విద్యార్థులకు, తోటి ఉపాధ్యాయులకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఫిన్లాండ్లో పొందే నూతన బోధనా పద్ధతులు, అనుభవాలను మన ప్రాంత విద్యార్థులకు అందించి వారి భవిష్యత్తును మరింత మెరుగ్గా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు.
విద్యకు సరిహద్దులు లేవని నిరూపిస్తూ అంతర్జాతీయ వేదికపై అడుగుపెడుతున్న షేక్ జవహర్ మునీర్కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
