SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 11 August 2026, 3:59 pm Posted by : SALAM PRODDATUR

సేవే లక్ష్యం.. తల్లి–బిడ్డల భద్రతే ధ్యేయం –ఎమ్మెల్యే వరద

 

–ప్రొద్దుటూరులో తల్లి–బిడ్డ ఎక్స్‌ప్రెస్ అంబులెన్స్ సేవలు ప్రారంభం

 

–ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి చేతుల మీదుగా వాహనాలకు ప్రారంభోత్సవం

 

సలాం  ప్రొద్దుటూరు:

తల్లి కడుపులోని బిడ్డ నుంచి ఇంటి గడప వరకు… ప్రతి అడుగులోనూ భద్రతకు భరోసా కల్పించేలా ప్రభుత్వం అందిస్తున్న తల్లి–బిడ్డ ఎక్స్‌ప్రెస్ అంబులెన్స్ సేవలు ప్రొద్దుటూరులో ప్రారంభమయ్యాయి. జిల్లా ఆసుపత్రి ప్రాంగణంలో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి చేతుల మీదుగా అంబులెన్స్ వాహనాలను ప్రారంభించారు.

 

గర్భిణీలు, బాలింతలు, నవజాత శిశువులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన రవాణా అందించడమే ఈ సేవల ప్రధాన ఉద్దేశమని ఎమ్మెల్యే తెలిపారు. ముఖ్యంగా పేద, గ్రామీణ ప్రాంతాల మహిళలకు ప్రసవ సమయంలో, ప్రసవానంతరం రవాణా ఇబ్బందులను అధిగమించేందుకు ఈ అంబులెన్స్‌లు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

 

ప్రభుత్వ ఆసుపత్రుల్లో గర్భిణీలు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకుని, ప్రభుత్వ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. తల్లి ఆరోగ్యం బాగుంటేనే బిడ్డ ఆరోగ్యం.. బిడ్డ ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబానికి సంపూర్ణ సంతోషం ఉంటుందని పేర్కొంటూ, ప్రభుత్వం అందిస్తున్న తల్లి–బిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

 

ప్రసవం అనంతరం తల్లి, శిశువులను సురక్షితంగా వారి ఇళ్లకు చేర్చడంలో ఈ అంబులెన్స్ సేవలు కీలకంగా నిలుస్తాయని వైద్యాధికారులు తెలిపారు.