SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 10 August 2026, 12:55 am Posted by : SALAM PRODDATUR

సేవే స్ఫూర్తి.. ఆరోగ్యమే లక్ష్యం..

–120 మందికి ఉచిత వైద్యం అందించిన హారిక హాస్పిటల్

–ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన

–“ప్రజా ఆరోగ్యమే మా లక్ష్యం” అంటూ సేవా స్ఫూర్తి చాటిన నిర్వాహకులు అయూబ్ ఖాన్, లాలు..

సలాం ప్రొద్దుటూరు :

సమాజానికి సేవ చేయాలనే సంకల్పం ఉంటే.. చిన్న ప్రయత్నం కూడా ఎంతోమందికి ఆరోగ్య భరోసాగా నిలుస్తుందని హారిక హాస్పిటల్ నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరం నిరూపించింది. ప్రొద్దుటూరు మున్సిపల్ ఉర్దూ హైస్కూల్ ఆవరణలో నిర్వహించిన ఈ వైద్య శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.

 

ఆర్థిక పరిస్థితులతో వైద్య సేవలకు దూరమయ్యే వారికి అండగా నిలవాలనే ఉద్దేశంతో నిర్వాహకులు ఎంపీజే రాయలసీమ ఇన్‌చార్జ్  అయూబ్ ఖాన్ , లాలు నిర్వహించిన ఈ శిబిరంలో 120 మందికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను ఉచితంగా అందించారు. వైద్య పరీక్షలతో పాటు ఆరోగ్య పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు.

 

కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించడం అభినందనీయమన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజంలో ఆరోగ్యంపై అవగాహన పెంచడంతో పాటు అవసరమైన వారికి ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు ఆరోగ్యానికి హానికరమైన చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు.

 

షేక్ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ డా. వి.ఎస్. ముక్తియార్ మాట్లాడుతూ వాతావరణ మార్పుల కారణంగా వచ్చే అనారోగ్య సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు మరిన్ని వైద్య శిబిరాలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. స్వచ్ఛంద సంస్థలు, సేవా సంస్థలు ముందుకు వచ్చి ప్రజారోగ్య పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

 

మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ విశ్వనాథ్ మాట్లాడుతూ ఆరోగ్యకరమైన సమాజం కోసం పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. ప్లాస్టిక్ వినియోగాన్ని అరికట్టేందుకు ప్రజలు సహకరించాలని కోరారు.

 

ప్రజలకు వైద్య సేవలను అందించడమే కాకుండా “ఆరోగ్యంపై అవగాహన.. సమాజంపై బాధ్యత.. సేవలో సంతృప్తి” అనే సందేశాన్ని ఈ ఉచిత వైద్య శిబిరం చాటిచెప్పింది. ఇటువంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తరించాలని స్థానికులు ఆకాంక్షించారు.

 

ఈ కార్యక్రమంలో వక్ఫ్ బోర్డు డైరెక్టర్ జాకిర్ అహ్మద్, ఎంపీజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ సలీం భాషా, టౌన్ బ్యాంక్ డైరెక్టర్ ఖలీల్ భాషా, ప్రధానోపాధ్యాయులు మనోహర్, వైద్యులు ఎం. రమేష్, ఎం. నాగయ్య, ఎంపీజే రాయలసీమ ఇన్‌చార్జ్ డా. అయూబ్ ఖాన్, ఎస్.ఎం. లాల్ బాషా, గౌస్ లాజం, న్యాయమతుల్లా, ఎస్.పి. ముక్తియార్, ఇంతియాజ్, ఫరాన్, జాఫర్ తదితరులు పాల్గొన్నారు.