SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 10 August 2026, 1:02 pm Posted by : SALAM PRODDATUR

వైఎస్సార్‌సీపీ నిరసనకు పోలీసుల అడ్డంకులు

 

–గాంధీపార్క్ వద్ద ఉద్రిక్తత.. నిరసనకారులను అడ్డుకున్న పోలీసులు

 

సలాం  ప్రొద్దుటూరు:

డీఎస్సీ నియామకాల్లో అవకతవకలు జరిగాయంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రొద్దుటూరులో చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు గాంధీపార్క్ వద్ద నిరసన చేపట్టేందుకు తరలివచ్చారు. అయితే పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

 

ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపేందుకు వచ్చిన తమను పోలీసులు అడ్డుకోవడం సరికాదని వైఎస్సార్‌సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసనను కొనసాగించేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని నిలువరించారు. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

 

అనంతరం గాంధీపార్క్ వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో వైఎస్సార్‌సీపీ కడప జిల్లా ఉపాధ్యక్షులు పోరెడ్డి నరసింహారెడ్డి మాట్లాడుతూ.. డీఎస్సీ నియామకాల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యత వహిస్తున్న విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నిరసనలను అడ్డుకోవడం ద్వారా ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న ప్రశ్నలకు సమాధానం దొరకదన్నారు.

 

మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పాతకోట బంగారు రెడ్డి మాట్లాడుతూ.. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకోవడం అప్రజాస్వామికమన్నారు. డీఎస్సీ నియామకాలపై అనుమానాలు ఉంటే సీబీఐతో విచారణ జరిపించి వాస్తవాలను ప్రజల ముందుంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

 

వైఎస్సార్‌సీపీ మహిళా నాయకులు సైతం ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై ప్రశ్నలు సంధించారు. ‘తల్లికి వందనం’, ఫీజు రీయింబర్స్‌మెంట్ తదితర అంశాల్లో ప్రభుత్వం విద్యార్థులు, తల్లిదండ్రులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

 

పోలీసుల అడ్డంకుల మధ్య కూడా నిరసన కార్యక్రమాన్ని కొనసాగించిన వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.