SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 08 August 2026, 7:50 pm Posted by : SALAM PRODDATUR

DSC అక్రమాలపై గర్జించిన మహిళా లోకం!

 

–మూడో రోజు రిలే దీక్షల్లో మహిళా నేతలు, DSC అభ్యర్థుల నినాదం

 

–CBI విచారణ, నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కోసం రాచమల్లు ఆధ్వర్యంలో పోరుబాట

 

సలాం ప్రొద్దుటూరు:

DSC నియామకాల్లో అక్రమాలపై CBI విచారణ చేపట్టాలని, నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ తదితర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ప్రొద్దుటూరులో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మూడో రోజుకు చేరుకున్నాయి. మునిసిపల్‌ కార్యాలయం మెయిన్‌ గేట్‌ ఎదుట వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతున్న దీక్షల్లో మూడో రోజు నియోజకవర్గానికి చెందిన పలువురు మహిళా నాయకులు, DSC అభ్యర్థులు, విద్యార్థినులు పాల్గొని నిరసన తెలిపారు.

 

DSC నియామకాలపై నెలకొన్న వివాదాలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని, అభ్యర్థులకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని మహిళా నేతలు, DSC అభ్యర్థులు డిమాండ్‌ చేశారు. సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ప్రజా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని వైఎస్సార్‌సీపీ నాయకులు పేర్కొన్నారు.

 

మహిళా నేతలు, అభ్యర్థులకు సంఘీభావం

 

మూడో రోజు రిలే దీక్షలకు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై సంఘీభావం తెలిపారు. మహిళా నేతలు, DSC అభ్యర్థులు దీక్షా శిబిరంలో పాల్గొని తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. అభ్యర్థుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం జరిగే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు.

 

పండ్లరసం అందించి దీక్ష విరమింపజేత

 

మూడో రోజు రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న మహిళా నాయకులు, DSC అభ్యర్థులు, విద్యార్థినులకు వైఎస్సార్‌సీపీ కడప జిల్లా ఉపాధ్యక్షుడు పోరెడ్డి నరసింహారెడ్డి పండ్లరసం అందించి దీక్షను విరమింపజేశారు. అనంతరం దీక్షలో పాల్గొన్న వారికి సంఘీభావం తెలిపారు.

 

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ప్రజా సమస్యలపై ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్‌సీపీ నాయకులు తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గంలోని వివిధ హోదాల్లో ఉన్న పార్టీ నాయకులు, మహిళా నేతలు, కార్యకర్తలు, DSC అభ్యర్థులు పాల్గొన్నారు.