SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 07 August 2026, 10:03 pm Posted by : SALAM PRODDATUR

ఉచిత మెగా మెడికల్ క్యాంప్‌ను సద్వినియోగం చేసుకోవాలి–ఏపి ఎన్‌జీఓ 

 

 

 

సలాం  ప్రొద్దుటూరు:

ఏపీ ఎన్‌జీఓఎస్ కడప జిల్లా అధ్యక్షులు బలపనూరు శ్రీనివాసులు ఉద్యోగులు, పెన్షనర్లు మరియు ప్రజలు ఉచిత మెగా మెడికల్ క్యాంప్‌ను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఆదివారం (ఆగస్టు 9) ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రొద్దుటూరు ఎన్‌జీఓ హోమ్‌లో నిర్వహించనున్న ఈ వైద్య శిబిరంలో అధిక సంఖ్యలో పాల్గొని ఉచిత వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరారు. శుక్రవారం ప్రొద్దుటూరు ఎన్‌జీఓ హోమ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ మెగా మెడికల్ క్యాంప్‌లో గుండె సంబంధిత, ఆర్థోపెడిక్, కంటి, జనరల్ మెడిసిన్ విభాగాలకు చెందిన నిపుణులైన వైద్యులు సేవలు అందించనున్నట్లు తెలిపారు. అలాగే ఈసీజీ (ECG), 2డీ ఎకో (2D Echo), షుగర్, రక్తపోటు (BP) తదితర పరీక్షలు పూర్తిగా ఉచితంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. హోలిస్టిక్ వైద్య నిపుణులు కూడా అందుబాటులో ఉండి వైద్య సేవలు అందిస్తారని, అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు.ప్రతి ఒక్కరూ వైద్యుల సూచనలు, సలహాలను పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని బలపనూరు శ్రీనివాసులు సూచించారు.ఈ మెగా మెడికల్ క్యాంప్‌కు ముఖ్య అతిథిగా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి హాజరుకానున్నారు.ఈ సమావేశంలో జిల్లా కోశాధికారి టీ. శ్రీనివాసులు, సంయుక్త కార్యదర్శి డి. పద్మనాభరావు, ప్రొద్దుటూరు తాలూకా అధ్యక్షులు రామసుబ్బయ్య, కార్యదర్శి ప్రమీల, కోశాధికారి సదాశివయ్య, ఉపాధ్యక్షులు నాగార్జున, వరప్రసాద్, కార్యనిర్వాహక కార్యదర్శి ప్రభంజన్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి నారాయణరాజు, మహిళా విభాగ సభ్యురాలు గంగాదేవి, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు పీరయ్య, కార్యదర్శి ఓంకార్, మహేశ్వరయ్య, నరసింహ తదితరులు పాల్గొన్నారు.