–స్వచ్ఛ సంకల్ప దీక్ష విజయవంతానికి భారీ ర్యాలీ
–ఆగస్టు 15 నుంచి ప్లాస్టిక్పై పూర్తి నిషేధానికి బ్లూప్రింట్ సిద్ధం
– ఆగస్టు 6న మెప్మా ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ
సలాం ప్రొద్దుటూరు:
ప్రొద్దుటూరును సంపూర్ణ ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు పురపాలక సంఘం సమగ్ర కార్యాచరణ చేపట్టిందని మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ తెలిపారు. ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని ఆగస్టు 15 నుంచి ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించేందుకు బ్లూప్రింట్ సిద్ధం చేసినట్లు వెల్లడించారు.
బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ, ప్రజలు, వ్యాపారవేత్తలు సహకరిస్తే ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరు లక్ష్యాన్ని సులభంగా సాధించవచ్చన్నారు. దుకాణాల్లో ప్లాస్టిక్ సంచులు, ఇతర ప్లాస్టిక్ ఉత్పత్తుల విక్రయాలు, వినియోగం పూర్తిగా నిలిపివేయాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై భారీ జరిమానాలతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్లాస్టిక్ వినియోగాన్ని సమర్థవంతంగా అరికట్టేందుకు ప్రత్యేక టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేయనున్నట్లు కమిషనర్ తెలిపారు. అలాగే స్వచ్ఛ సంకల్ప దీక్షకు సహకరించని సంబంధిత సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ప్రస్తుతం ప్రొద్దుటూరులో రోజుకు 18 నుంచి 20 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను పారిశుధ్య కార్మికులు సేకరిస్తున్నారని పేర్కొన్న ఆయన, పర్యావరణానికి పెను ముప్పుగా మారుతున్న ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు ప్రతి వ్యాపార సంస్థ సామాజిక బాధ్యతతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 6న మెప్మా ఆధ్వర్యంలో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించనున్నట్లు కమిషనర్ తెలిపారు. ఈ ర్యాలీకి ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారని చెప్పారు. ర్యాలీ అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్ నుంచి ప్రారంభమై మెయిన్ రోడ్డులోని శివాలయం వరకు కొనసాగుతుందని, అనంతరం మానవహారం ఏర్పాటు చేసి ప్రజలు, వ్యాపారవేత్తల్లో ప్లాస్టిక్ నివారణపై విస్తృత అవగాహన కల్పిస్తామని వివరించారు.
ఈ కార్యక్రమంలో మెప్మా సి.ఎం.ఎం. మహాలక్ష్మి, శానిటరీ సూపర్వైజర్ నూర్బాషా తదితరులు పాల్గొన్నారు.