SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 05 August 2026, 7:55 pm Posted by : SALAM PRODDATUR

పోలీస్ సేవల్లో పారదర్శకతకు ప్రాధాన్యం–ఎస్పీ

 

 

–ప్రొద్దుటూరు పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్

 

–పెండింగ్ కేసుల పరిష్కారం వేగవంతం చేయాలి..

–ప్రజల ఫిర్యాదులపై తక్షణ స్పందన ఉండాలని అధికారులకు ఆదేశాలు

 

సలాం ప్రొద్దుటూరు:

జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, పోలీస్ సేవల నాణ్యత మెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారించిన జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ నచికేత్ విశ్వనాథ్ బుధవారం ప్రొద్దుటూరు పట్టణంలోని పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ల పనితీరు, రికార్డుల నిర్వహణ, పెండింగ్ కేసుల స్థితిగతులు, సిబ్బంది విధి నిర్వహణను క్షుణ్ణంగా పరిశీలించి అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.

 

తనిఖీ సందర్భంగా పెండింగ్‌లో ఉన్న కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, చట్టపరమైన ప్రక్రియలను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజల నుంచి అందే ఫిర్యాదులపై వెంటనే స్పందించి, బాధితులకు న్యాయం జరిగేలా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.

 

జిల్లాలో నేరాల నియంత్రణకు పోలీసులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, అసాంఘిక కార్యకలాపాలపై నిరంతర నిఘా కొనసాగించాలని ఎస్పీ స్పష్టం చేశారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే అంశాలపై ముందస్తు చర్యలు తీసుకుంటూ ప్రజల్లో భద్రతాభావాన్ని పెంపొందించేలా పని చేయాలని పేర్కొన్నారు.

 

పోలీస్ సేవలను మరింత పారదర్శకంగా, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అందించాలని, పోలీస్ స్టేషన్లలో క్రమశిక్షణ, పరిశుభ్రత, రికార్డుల నిర్వహణ ప్రమాణాలను మెరుగుపరచాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజా విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసే విధంగా ప్రతి పోలీస్ అధికారి బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ సూచించారు.