

సలాం ప్రొద్దుటూరు:
మెగా డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ చేపట్టాలని, ఈ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, నిరుద్యోగ యువతకు ఎన్నికల హామీ మేరకు నిరుద్యోగ భృతి అందించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 6వ తేదీ నుంచి చేపట్టనున్న ఉద్యమ కార్యాచరణను వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పార్టీ శ్రేణులకు వివరించారు.
ప్రొద్దుటూరులో రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు, వాటి అమలులో జరిగిన వైఫల్యాలను ప్రజలకు వివరించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. పార్టీ విజయమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని, ఈ పోరాటంలో తమ పూర్తి సహకారం ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.
ఈ సమావేశంలో ప్రొద్దుటూరు నియోజకవర్గానికి చెందిన వివిధ హోదాల్లో ఉన్న పార్టీ నాయకులు, మహిళా నేతలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
