SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 01 August 2026, 8:51 pm Posted by : SALAM PRODDATUR

అనారోగ్యంతోనే మార్కెట్ యార్డ్ చైర్‌పర్సన్ రాజీనామా..

–రాజకీయ లబ్ధి  కోసం బీసీలను మధ్యలోకి లాగొద్దు– వద్ది బాలుడు

 

సలాం ప్రొద్దుటూరు:

వ్యవసాయ మార్కెట్ యార్డ్ మాజీ చైర్‌పర్సన్ సురేఖ అనారోగ్య పరిస్థితుల కారణంగానే పదవికి రాజీనామా చేశారని ఆమె భర్త వద్ది బాలుడు స్పష్టం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన, రాజకీయ ప్రయోజనాల కోసం బీసీ వర్గాలను వివాదాల్లోకి లాగవద్దని విజ్ఞప్తి చేశారు.

 

తన భార్య రాజీనామా పూర్తిగా ఆరోగ్య కారణాలతోనే జరిగిందని, ఈ విషయాన్ని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డికి ముందుగానే తెలియజేసిన అనంతరమే రాజీనామా నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. పార్టీ కార్యకలాపాలకు తాము దూరం కాలేదని, నాలుగు దశాబ్దాలకు పైగా తెలుగుదేశం పార్టీకి విధేయులుగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు.

 

కొంతమంది టీడీపీ నాయకులు సోషల్ మీడియా వేదికగా తమపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించిన వద్ది బాలుడు, వ్యక్తిగత విమర్శలు చేయడం, వాస్తవాలను వక్రీకరించడం బాధ్యతారాహిత్యమని అన్నారు. బీసీ వర్గాలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించబోమని హెచ్చరించారు.

 

ఒకే పార్టీలో కొనసాగుతూ సొంత పార్టీ నాయకులపై ఆరోపణలు చేయడం పార్టీ క్రమశిక్షణకు విరుద్ధమని పేర్కొన్న ఆయన, గతంలో నందం సుబ్బయ్య మరణ ఘటనలో కూడా ఇదే టీడీపీ నాయకుడి పాత్ర ఉందని ఆరోపించారు.

 

రాజకీయాల్లో పరస్పర గౌరవం, సమన్వయం అవసరమని పేర్కొన్న వద్ది బాలుడు, తనపై వచ్చిన ఆరోపణలు, ఇటీవల జరిగిన పరిణామాలన్నింటినీ పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. అవసరమైతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిసి ఫిర్యాదు చేస్తానని వెల్లడించారు.