SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 30 July 2026, 7:51 pm Posted by : SALAM PRODDATUR

పట్టణంలో చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాల నివారణకు తక్షణ చర్యలు తీసుకోవాలి–ఎం పి జె

 

సలాం ప్రొద్దుటూరు:

 

 

పట్టణంలో పారిశుద్ధ్య సమస్యలు, ప్రజల భద్రతకు సంబంధించిన అంశాలను అత్యవసరంగా పరిష్కరించాలని కోరుతూ మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ (ఎంపీజే) ప్రతినిధులు నూతన మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ విశ్వనాధ్ను కలిసి గురువారం వినతిపత్రం సమర్పించారు. పట్టణంలో రోజురోజుకూ పెరుగుతున్న చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు, ప్రజా భద్రతకు ముప్పుగా మారుతున్న సమస్యలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.

 

మడూరు కాల్వకు రక్షణ కంచె ఏర్పాటు చేయాలి

 

మడూరు కాల్వ పరిసరాల్లో రక్షణ కంచె లేకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఎంపీజే నాయకులు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రజల ప్రాణ భద్రత దృష్ట్యా వెంటనే రక్షణ కంచె ఏర్పాటు చేసి ప్రమాదాలను నివారించే చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

 

గాంధీ పార్కులో చిన్నారుల భద్రతకు చర్యలు అవసరం

 

మున్సిపల్ గాంధీ పార్కులో చిన్నారులు ఆడుకునే ఉయ్యాలల వద్ద సిమెంట్ దిమ్మెలు బయటకు కనిపిస్తుండటంతో ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆ ప్రాంతంలో వెంటనే ఇసుక వేసి, అవసరమైన మరమ్మతులు చేపట్టి చిన్నారుల భద్రతను నిర్ధారించాలని కోరారు.

 

ఫుడ్ కోర్టులు, హోటళ్ల వద్ద పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి

 

పట్టణంలోని ఫుడ్ కోర్టులు, టీ బంకులు, హోటళ్ల పరిసరాల్లో టీ కప్పులు, ప్లాస్టిక్ వ్యర్థాలు, ఇతర చెత్త పేరుకుపోయి అపరిశుభ్ర వాతావరణం నెలకొంటోందని ఎంపీజే ప్రతినిధులు తెలిపారు. పారిశుద్ధ్య నిబంధనలు ఉల్లంఘిస్తున్న హోటల్ యజమానులపై కఠిన చర్యలు తీసుకుని, పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని కోరారు.

 

సమస్యల పరిష్కారానికి హామీ

 

వినతిపత్రాన్ని స్వీకరించిన మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ విశ్వనాధ్ పట్టణంలోని సమస్యలను పరిశీలించి, సంబంధిత అధికారులతో సమన్వయం చేసి సాధ్యమైనంత త్వరగా పరిష్కార చర్యలు చేపడతామని హామీ ఇచ్చినట్లు ఎంపీజే నాయకులు తెలిపారు.

 

పాల్గొన్న నాయకులు

 

ఈ కార్యక్రమంలో ఎంపీజే రాయలసీమ ఇన్‌చార్జ్ డా. ఎం.డి. అయూబ్ ఖాన్, పట్టణ అధ్యక్షుడు హుస్సేన్ భాషా, పట్టణ కార్యదర్శి రఫీ, సభ్యులు ముక్తియార్, విద్యా కమిటీ చైర్మన్ లాల్ బాషా, షఫీ, అల్లాబకాష్, ఫరన్ తదితరులు పాల్గొన్నారు.