SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 30 July 2026, 9:59 pm Posted by : SALAM PRODDATUR

ఆగస్టు ఒకటో తేదీ నుంచి ప్రజలకు నాణ్యమైన బియ్యం–జాయింట్ కలెక్టర్ నిధి మీన

సలాం ప్రొద్దుటూరు :

 

జిల్లా లోని రైతు బజార్లు, రైస్ మిల్లర్ల ప్రత్యేక కౌంటర్ల ద్వారా ఆగస్టు 1వ తేదీ నుంచి నాణ్యమైన బియ్యం ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ డా నిధీ మీనా, పౌర సరఫరా శాఖ అధికారులను ఆదేశించారు.

గురువారం కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ హాల్లో జాయింట్ కలెక్టర్ డా నిధీ మీనా, పౌర సరఫరాలు, మార్కెటింగ్ శాఖ అధికారులు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమై ఆగస్టు 1వ తేదీ నుంచి జిల్లాలో ప్రజలకు బీపీటీ సూపర్ ఫైన్ బియ్యం కేజీ రూ.52/- లకు, గ్రేడ్ 1 పచ్చి బియ్యం (రా రైస్) రూ. 50/- లకు నాణ్యమైన బియ్యాన్ని అందించే లక్ష్యంతో చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు.

ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, రాష్ట్ర వ్యాప్తంగా ఆగష్టు 1 నుంచి ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని అందించే కార్యక్రమం చేపట్టనున్న నేపథ్యంలో జిల్లాలో పౌర సరఫరాలు, మార్కెటింగ్ శాఖ అధికారులు, రైస్ మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులు సమన్వయం తో పనిచేసి రైతు బజార్ల వద్ద మరియు రైస్ మిల్లర్స్ అవుట్ లెట్స్ వద్ద నాణ్యమైన బియ్యం అమ్మకాల కౌంటర్ల ఏర్పాటుకు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పౌర సరఫరా శాఖ అధికారులు ప్రతి రోజూ సంబంధిత కౌంటర్ల ను విజిట్ చేయడంతో పాటు స్టాక్ వివరాలను, ఓపెనింగ్, క్లోజింగ్ స్టాక్ వివరాలు నమోదు చెయ్యాలన్నారు. మంచి నాణ్యత గల బియ్యాన్ని అందుబాటు ధరలకు ప్రజలకు సరఫరా చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు. గుర్తించబడిన రైస్ మిల్లు అవుట్‌లెట్ల ద్వారా ఆమోదించబడిన బియ్యం రకాలను మాత్రమే సరఫరా చేయాలని, అధిక ధరలు వసూలు చేయడం లేదా అనధికారికంగా అదనపు రుసుములను వసూలు చేయడం అనుమతించబడదని జాయింట్ కలెక్టర్ స్పష్టం చేశారు. నాణ్యతా ప్రమాణాలను పాటించడంతో పాటు ఏర్పాటు చేసిన అన్ని అవుట్‌లెట్లలో తగినంత నిల్వ ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి అవుట్‌లెట్‌లో ధరల బోర్డులు, అందుబాటులో ఉన్న రకాలు, పనివేళలు మరియు కార్యక్రమ వివరాలను స్పష్టంగా ప్రదర్శించాలన్నారు. వినియోగదారుల సంతృప్తికి ప్రాధాన్యత ఇస్తూ నాణ్యమైన బియ్యం నిరంతరాయంగా లభించేలా చర్యలు చేపట్టాలన్నారు. నాణ్యమైన బియ్యం అమ్మకాల విషయాన్ని ప్రజలకు అవగాహన కల్పించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్, పౌర సరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు.

 

ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి  సుబ్రహ్మణ్యేశ్వర రావు, డిఎం సివిల్ సప్లయ్  నాగ సుధ, మార్కెటింగ్ శాఖ ఏడి  నరేంద్ర, పౌర సరఫరాల శాఖ అధికారులు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.