SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 28 July 2026, 12:18 am Posted by : SALAM PRODDATUR

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నగదు పురస్కారాలు అందజేసిన వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి

సలాం ప్రొద్దుటూరు:

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యకు ప్రోత్సాహం అందించాలనే ఉద్దేశంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రొద్దుటూరు పట్టణ అధ్యక్షులు భూమిరెడ్డి వంశీధర్ రెడ్డి విద్యార్థులను నగదు పురస్కారాలతో సత్కరించారు.

 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నాడు–నేడు కార్యక్రమం ద్వారా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరియు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సహకారంతో, తాను 32వ వార్డు కౌన్సిలర్‌గా ఉన్న సమయంలో శ్రీ ఊటుకూరి వీరయ్య ప్రభుత్వ ఉన్నత పాఠశాల (గురవయ్యతోట)లో సుమారు ₹2 కోట్ల వ్యయంతో పాఠశాల రూపురేఖలు మారేలా అభివృద్ధి పనులు చేపట్టడం గర్వకారణమని పేర్కొన్నారు.

 

ఆ అభివృద్ధికి గుర్తింపుగా, ప్రతి సంవత్సరం ఆ పాఠశాలలో పదో తరగతి పరీక్షల్లో ప్రథమ మూడు స్థానాలు సాధించిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహక బహుమతులు అందజేస్తున్నామని తెలిపారు. అందులో భాగంగా గత విద్యా సంవత్సరంలో ప్రతిభ కనబరిచిన ముగ్గురు విద్యార్థులకు ఒక్కొక్కరికి ₹2,000 చొప్పున, మొత్తం ₹6,000 నగదు పురస్కారాన్ని పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో అందజేశారు.

 

అనంతరం ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న విద్యార్థులతో సమావేశమైన వంశీధర్ రెడ్డి, యువతే దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే శక్తి అని పేర్కొన్నారు. విద్యార్థులు అంకితభావంతో చదివి రాబోయే పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. వచ్చే ఏడాది కూడా ప్రథమ మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు ఇదే విధంగా నగదు పురస్కారాలు అందజేస్తామని ప్రకటిస్తూ, విద్యార్థుల్లో నూతన ఉత్సాహాన్ని నింపారు.