SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 28 July 2026, 7:06 pm Posted by : SALAM PRODDATUR

“మన ప్రాంతం.. మన పంచాయతీని నిలుపుకుందాం”–మల్లెల ఝాన్సీ 

 

 

సలాం ప్రొద్దుటూరు: 

 

కొత్తపల్లి గ్రామ పంచాయతీని ప్రొద్దుటూరు మున్సిపాలిటీ/కార్పొరేషన్ పరిధిలో విలీనం చేసే ప్రతిపాదనపై నిర్వహించిన గ్రామసభలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ (ఆప్కాబ్ – APCOB) మాజీ ఛైర్‌పర్సన్‌ మల్లెల ఝాన్సీ గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. గ్రామ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఎలాంటి ఒత్తిళ్లకు లోనుకాకుండా స్వచ్ఛందంగా తమ అభిప్రాయాన్ని వెల్లడించాలని ఆమె కోరారు.

పంచాయతీ నుంచి కార్పొరేషన్ పరిధిలోకి విలీనం అయితే పన్నుల భారం పెరిగే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు. ఖాళీ స్థలం కూడా పన్నులు కట్టవలసి ఉంటుందన్నారు.

 

ప్రస్తుతం అమృత్‌నగర్‌ పంచాయతీలో ఉండడం వలన పన్నులు లేవని , అదే కార్పొరేషన్ పరిధిలోకి వెళితే పన్నులు విధించే పరిస్థితి రావచ్చని అన్నారు.

అలాగే, వెయ్యి చదరపు అడుగులకు పైగా స్థలం ఉన్నవారి పెన్షన్లపై ప్రభావం ఉండే అవకాశాల గురించి ప్రజలు తెలుసుకుని నిర్ణయం తీసుకోవాలని సూచించారు.

గతంలో కడప కార్పొరేషన్‌లో విలీనం చేసిన చుట్టూ ప్రక్కల గ్రామాల పరిస్థితి, అక్కడ అభివృద్ధి ఏ మేరకు జరిగిందో ప్రజలు పరిశీలించి, వాటిని దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాలని ఆమె పేర్కొన్నారు. పంచాయతీ నుంచి కార్పొరేషన్ అయితే మన పనులు ఎలా జరుగుతాయో త్వరగా అవుతాయా ? ఆలస్యమైతాయా అని కూడా ప్రజలు తెలుసుకొవాలన్నారు.

“మన ప్రాంతం… మన పంచాయతీ… నిలుపుకుందాం” అనే నినాదంతో గ్రామ ప్రజలు ఐక్యంగా ఉండాలని, తమ అభిప్రాయాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా, స్వచ్ఛందంగా తెలియజేయాలని మల్లెల ఝాన్సీ పిలుపునిచ్చారు.