SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 28 July 2026, 3:01 pm Posted by : SALAM PRODDATUR

కొత్తపల్లెలో భారీ బందోబస్తు మధ్య గ్రామసభ..

 

–ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో విలీనంపై ప్రజాభిప్రాయ సేకరణ మళ్లీ నిర్వహణ

 

సలాం ప్రొద్దుటూరు:

ప్రొద్దుటూరు మండలంలోని ఐదు గ్రామ పంచాయతీలను ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో విలీనం చేసేందుకు ప్రభుత్వం చేపట్టిన ప్రక్రియలో భాగంగా కొత్తపల్లె గ్రామ పంచాయతీలో మంగళవారం మరోసారి గ్రామసభ నిర్వహించారు. గతంలో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో అవకతవకలు చోటుచేసుకున్నాయనే ఆరోపణల నేపథ్యంలో ఈ గ్రామసభను భారీ పోలీసు బందోబస్తు మధ్య నిర్వహించారు.

 

ఇప్పటికే చౌటపల్లె, దొరసానిపల్లె, గోపవరం గ్రామ పంచాయతీలలో గ్రామసభలు నిర్వహించగా, విలీనానికి అధిక సంఖ్యలో ప్రజలు మద్దతు తెలిపినట్లు అధికారులు వెల్లడించారు. ఈ నెల 30న సోములవారిపల్లె గ్రామ పంచాయతీలో గ్రామసభ నిర్వహించనున్నారు.

 

కొత్తపల్లెలో ఈ నెల 17న నిర్వహించిన తొలి గ్రామసభలో ప్రజాభిప్రాయ సేకరణ పారదర్శకంగా జరగలేదని, బయటి వ్యక్తులు వచ్చి సంతకాలు చేసినట్లు డీఎల్డీఓ, గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి మంజులవాణి గుర్తించారు. దీంతో ఆ గ్రామసభను రద్దు చేసి మంగళవారం ఉదయం 11 గంటలకు తిరిగి గ్రామసభ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

 

ఆధార్, ఓటరు గుర్తింపు కార్డులతోనే ప్రవేశం

 

గ్రామసభకు బయటి వ్యక్తులు హాజరుకాకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఆధార్ లేదా ఓటరు గుర్తింపు కార్డులు తీసుకొచ్చిన గ్రామస్థులకు మాత్రమే సభ ప్రాంగణంలోకి అనుమతి ఇచ్చారు. గత గ్రామసభలో ఘర్షణ చోటుచేసుకున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉదయం నుంచే గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

 

ఏఎస్పీ విభూ కృష్ణ ఆదేశాల మేరకు రూరల్ సీఐ నాగభూషణ్ ఆధ్వర్యంలో ఎస్ఐలు, పోలీసు సిబ్బంది భద్రతా ఏర్పాట్లు చేపట్టి, గ్రామసభ ప్రశాంతంగా జరిగేలా పర్యవేక్షించారు. అధికారులు ప్రజల అభిప్రాయాలను నమోదు చేసే ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించారు.

జమ్మలమడుగు డిడిఓ, స్పెషల్ ఆఫీసర్ మంజుల వాణి , డి ఎల్ డి ఓ నూర్జహాన్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస విశ్వనాథ్ డిప్యూటీ ఎంపీడీవో రామాంజనేయులు రెడ్డి అసిస్టెంట్ సిటీ ప్లానర్  ఆధ్వర్యంలో ప్రత్యేక గ్రామసభ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాలు చేపట్టారు