SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 28 July 2026, 9:05 pm Posted by : SALAM PRODDATUR

కార్పొరేషన్‌తో బ్యాంకింగ్ సేవల విస్తరణ.. పేద, మధ్యతరగతి ప్రజల ఆర్థికాభివృద్ధికి ఊతం– బి.వి. సుబ్బారెడ్డి

 

 

 

సలాం ప్రొద్దుటూరు:

ప్రొద్దుటూరును కార్పొరేషన్‌గా ఏర్పాటు చేస్తే పట్టణం అన్ని రంగాల్లో వేగవంతమైన అభివృద్ధి సాధించడంతో పాటు బ్యాంకింగ్ సేవలు కూడా విస్తృతంగా అందుబాటులోకి వస్తాయని ప్రొద్దుటూరు కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లిమిటెడ్ చైర్మన్ బి.వి. సుబ్బారెడ్డి పేర్కొన్నారు.

 

ప్రస్తుతం ప్రొద్దుటూరు కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ సేవలు మున్సిపాలిటీ పరిధికే పరిమితమై ఉన్నాయని ఆయన తెలిపారు. కొత్తపల్లితో పాటు ప్రతిపాదిత గ్రామపంచాయతీలు ప్రొద్దుటూరు పరిధిలో విలీనం చెంది భవిష్యత్తులో కార్పొరేషన్‌గా ఏర్పడితే, బ్యాంకు సేవలను కార్పొరేషన్ పరిధి అంతటా విస్తరించే అవకాశం ఉంటుందన్నారు.

 

కార్పొరేషన్ హోదా వల్ల మౌలిక సదుపాయాల అభివృద్ధితో పాటు బ్యాంకింగ్ రంగం విస్తరించి, పేదలు, మధ్యతరగతి కుటుంబాలు, చిన్న వ్యాపారులు, స్వయం ఉపాధి పొందుతున్న వారికి రుణ సదుపాయాలు మరింత సులభంగా అందుతాయని చెప్పారు. దీనివల్ల కొత్త ఉపాధి అవకాశాలు పెరిగి స్థానిక ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడంతో పాటు ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు.

 

ప్రొద్దుటూరును కార్పొరేషన్‌గా తీర్చిదిద్దడం ద్వారా సమగ్ర పట్టణాభివృద్ధికి బాటలు పడతాయని, ప్రభుత్వ సేవలు, ఆర్థిక అవకాశాలు, ప్రజలకు అందే సౌకర్యాలు మరింత విస్తరించే అవకాశముందని బి.వి. సుబ్బారెడ్డి పేర్కొన్నారు.