–గంటలోనే 26 ఫిర్యాదులు..
–పారిశుధ్యం, తాగునీరు, వీధిదీపాలే ప్రధాన సమస్యలు
సలాం ప్రొద్దుటూరు:
ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించాలనే లక్ష్యంతో ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస విశ్వనాథ్ ప్రారంభించిన “కమీషనర్తో ముఖాముఖీ” ఫోన్-ఇన్ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. సోమవారం ఉదయం 9 గంటలకు మున్సిపల్ కార్యాలయంలో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో గంట వ్యవధిలోనే 26 ఫిర్యాదులు ఫోన్ ద్వారా నమోదయ్యాయి.
నమోదైన ఫిర్యాదుల్లో పారిశుధ్యం, తాగునీటి సరఫరా, వీధి దీపాల సమస్యలు అధికంగా ఉండగా, మురుగునీటి పారుదల, ట్రాఫిక్, ఆక్రమణలపై కూడా పలు ఫిర్యాదులు వచ్చాయి. కమిషనర్ స్వయంగా ప్రతి ఫిర్యాదును నమోదు చేసి, తక్షణ పరిష్కారం కోసం సంబంధిత శాఖ అధికారులకు పంపించారు.
ఈ సందర్భంగా కమిషనర్ శ్రీనివాస విశ్వనాథ్ మాట్లాడుతూ, దివ్యాంగులు, వృద్ధులు, మహిళలు, విద్యార్థులు, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ప్రతి సోమవారం జరిగే పీ.జీ.ఆర్.ఎస్. కార్యక్రమానికి హాజరు కావడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున వారి సౌకర్యార్థం ఈ ఫోన్-ఇన్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమం ద్వారా మున్సిపల్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు అధికారుల్లో జవాబుదారీతనం, పారదర్శకత పెరిగి ప్రజలకు మెరుగైన సేవలు అందించే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి సమస్యను సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ప్రతి సోమవారం పీ.జీ.ఆర్.ఎస్. కార్యక్రమానికి గంట ముందు, ఉదయం 9 నుంచి 10 గంటల వరకు “కమీషనర్తో ముఖాముఖీ” ఫోన్-ఇన్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను తెలియజేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ మంజునాథ్ గౌడ్, మున్సిపల్ ఇంజనీర్ ఎం. శ్రీనివాసులు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు యశోద, రాజేష్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ కృష్ణ, అసిస్టెంట్ ఇంజనీర్ సురేంద్ర, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఎం. రమేష్ తదితర అధికారులు పాల్గొన్నారు.