SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 25 July 2026, 11:50 pm Posted by : SALAM PRODDATUR

నేటితో ఎస్‌ఐఆర్ నమోదు ముగింపు..!!

సలాం ప్రొద్దుటూరు (కడప):

–కడప జిల్లాలో 87.09 శాతం డిజిటలీకరణ పూర్తి

–18.96 లక్షల మంది ఓటర్లకు 100 శాతం ఫారాల పంపిణీ

–అర్ధరాత్రి 12 గంటల వరకు మాత్రమే నమోదు అవకాశం

వైఎస్సార్ కడప జిల్లాలో భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమం చివరి దశకు చేరుకుంది. జూలై 24 రాత్రి 12 గంటలతో నమోదు ప్రక్రియ ముగియనుంది. ఇంకా నమోదు చేయని అర్హులైన ఓటర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల యంత్రాంగం సూచించింది.

జిల్లా వ్యాప్తంగా మొత్తం 18,96,231 మంది ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాల (ఈఎఫ్‌లు) పంపిణీని 100 శాతం పూర్తి చేశారు. వీటిలో 16,51,355 ఫారాలను డిజిటలీకరించి 87.09 శాతం నమోదు పూర్తిచేశారు. జూలై 14 నుంచి 24 వరకు 6,505 ఫారాలను అదనంగా డిజిటలీకరించడం ద్వారా నమోదు ప్రక్రియను వేగవంతం చేశారు.

*జమ్మలమడుగు అగ్రస్థానం.. కడపలో ఇంకా మెరుగుదలకు అవకాశం*

డిజిటలీకరణలో జమ్మలమడుగు నియోజకవర్గం 90.83 శాతంతో మొదటి స్థానంలో నిలవగా, బద్వేల్ 90.16 శాతం, మైదుకూరు 89.58 శాతం, కమలాపురం 89.29 శాతం, రాజంపేట 88.54 శాతం, ప్రొద్దుటూరు 87.30 శాతం, పులివెందుల 87.08 శాతం నమోదు చేశాయి. కడప నియోజకవర్గంలో 76.54 శాతం డిజిటలీకరణ పూర్తైంది.

*ఏఎస్‌డీ పరిశీలనలో 2.44 లక్షల కేసులు*

ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా జిల్లాలో 2,44,876 ఏఎస్‌డీ (చిరునామా/స్థితి వ్యత్యాసాలు) కేసులు, అంటే మొత్తం ఓటర్లలో 12.91 శాతం గుర్తించారు. వీటిలో 59,730 మరణించినవారు, 65,060 శాశ్వతంగా నివాసం మార్చుకున్నవారు, 40,165 ఇప్పటికే ఇతర ప్రాంతాల్లో ఓటర్లుగా నమోదైనవారు, 79,382 గైర్హాజరైనవారు, 539 ఇతర కారణాలకు సంబంధించినవారు ఉన్నట్లు నివేదిక వెల్లడించింది.

అదేవిధంగా జిల్లాలో 66,607 ఏఎస్‌డీ వ్యత్యాసాలు, 4,396 డీఎస్‌ఈ కేసులు గుర్తించగా, వాటి ధృవీకరణ ప్రక్రియ కొనసాగుతోంది.