సలాం ప్రొద్దుటూరు (కడప ):
నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ ఘటనకు నిరసనగా, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టిన విద్యార్థులు, యువతపై జరిగిన లాఠీచార్జ్ను ఖండిస్తూ ప్రగతిశీల రెవల్యూషనరీ విద్యార్థి యువజన సంఘం (PRSYF) ఆధ్వర్యంలో శుక్రవారం కడప నగరంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద విద్యాసంస్థల బంద్ నిర్వహించారు.
ఈ సందర్భంగా నిరసనకారులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, నీట్ ప్రశ్నాపత్రం లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన PRSYF రాష్ట్ర కన్వీనర్ కన్నెలూరు శంకర్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్న నీట్ పరీక్షల నిర్వహణలో జరిగిన వైఫల్యాలకు కేంద్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని అన్నారు. ప్రశ్నాపత్రం లీకేజీ ఘటనపై సమగ్ర, పారదర్శక దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అలాగే ఢిల్లీలో శాంతియుతంగా నిరసన చేపట్టిన విద్యార్థులు, యువజన సంఘాల నాయకులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. విద్యార్థుల ప్రజాస్వామ్య హక్కులను అణచివేయడం తగదని, వారి న్యాయమైన డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు.