SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 24 July 2026, 8:34 pm Posted by : SALAM PRODDATUR

విద్యార్థుల విద్యాభివృద్ధికి తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల సమన్వయం కీలకం: డా. వి.ఎస్. ముక్తియార్

 

 

సలాం  ప్రొద్దుటూరు:

స్థానిక మోడంపల్లిలోని మున్సిపల్ ఉర్దూ హైస్కూల్‌లో శుక్రవారం నిర్వహించిన మెగా పేరెంట్–టీచర్ మీటింగ్   కార్యక్రమం  ఉత్సాహభరితంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర షేక్ వెల్ఫేర్ & డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డా. వి.ఎస్. ముక్తియార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా విద్యార్థుల విద్యా పురోగతి, అభ్యాస సామర్థ్యాల పెంపు, పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించడంలో తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల పాత్రపై ఆయన సమగ్రంగా చర్చించారు. విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో కుటుంబం, పాఠశాల కలిసి పనిచేసినప్పుడే ఆశించిన ఫలితాలు సాధ్యమవుతాయని పేర్కొన్నారు.

ప్రతి విద్యార్థి తన లక్ష్యాన్ని స్పష్టంగా నిర్దేశించుకుని క్రమశిక్షణతో చదువుకుంటే ఉన్నత శిఖరాలను అధిరోహించగలడని డా. ముక్తియార్ అన్నారు. విద్యార్థులు విద్యతో పాటు నైతిక విలువలను అలవరచుకుని సమాజానికి ఆదర్శప్రాయులుగా ఎదగాలని ఆకాంక్షించారు.

 

ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఘన సన్మానం

 

స్థానిక మోడంపల్లి మున్సిపల్ ఉర్దూ హైస్కూల్‌లో  విద్యలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఏడుగురు విద్యార్థి, విద్యార్థినులను మన ప్రజా సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ప్రతిభావంతులైన విద్యార్థులకు జ్ఞాపిక (మెమెంటో), స్మార్ట్ వాచ్, కిచెన్ గ్లాస్ బౌల్‌లను అందజేయడంతో పాటు శాలువాలు కప్పి అభినందించారు. విద్యార్థులు విద్యలో మరింత ఉన్నత విజయాలు సాధించి పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని పలువురు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మన ప్రజా సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు డా. ఎం.డి. అయూబ్ ఖాన్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మనోహర్, విద్యా కమిటీ చైర్మన్ లాల్ బాషా, టౌన్ బ్యాంక్ డైరెక్టర్ ఖలీల్, విశ్రాంత ఉపాధ్యాయులు గౌస్ లాజం, సాదిక్, మార్కెట్ ఖాదర్ వలీ, ఉపాధ్యాయులు, విద్యా కమిటీ సభ్యులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. కార్యక్రమం విద్యార్థులను ప్రోత్సహించే విధంగా విజయవంతంగా సాగింది.