SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 22 July 2026, 5:22 pm Posted by : SALAM PRODDATUR

ఆప్కాస్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి జూలై 30 ధర్నాను జయప్రదం చేయాలి– సీఐటీయూ

 

సలాం ప్రొద్దుటూరు  (పెద్దముడియం):

ఆప్కాస్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ సిబ్బంది, సెకండ్ ఏఎన్‌ఎంలు, ఆరోగ్య మిత్రలు, ఆయుష్, 108, 104, తల్లి-బిడ్డ ఎక్స్‌ప్రెస్, నేషనల్ హెల్త్ మిషన్, సమగ్ర శిక్ష తదితర విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులకు కనీస టైమ్ స్కేల్ (Minimum Time Scale) అమలు చేసి, రెగ్యులరైజేషన్ చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 30న కడప కలెక్టరేట్ వద్ద నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని సీఐటీయూ పిలుపునిచ్చింది.

 

ఈ నేపథ్యంలో పెద్దముడియంలో సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలతో కలిసి కరపత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జమ్మలమడుగు పట్టణ సీఐటీయూ ప్రధాన కార్యదర్శి ఏ. వినయ్ కుమార్, పట్టణ అధ్యక్షుడు ఏ. సుధాసు, పెద్దముడియం మండల కన్వీనర్ లక్ష్మీదేవి, పట్టణ అధ్యక్షురాలు భాగ్యమ్మ పాల్గొన్నారు.

 

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ప్రభుత్వ శాఖల్లో దశాబ్దాలుగా పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు కనీస టైమ్ స్కేల్ అమలు చేయకపోవడం అన్యాయమన్నారు. సుప్రీంకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పుల ప్రకారం సమాన పనికి సమాన వేతనం, దీర్ఘకాలంగా పనిచేస్తున్న ఉద్యోగుల రెగ్యులరైజేషన్ అమలు చేయాల్సి ఉన్నప్పటికీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.

 

ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వ పథకాల కింద పనిచేస్తున్న ఉద్యోగులను శాశ్వతీకరించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో కూడా అదే విధానం అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఉద్యోగులందరూ కుటుంబ సభ్యులతో కలిసి జూలై 30న కడప కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాలో భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

 

ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు ఎస్. శేఖర్, ఏఎన్‌ఎంలు తులసమ్మ, ప్రవీణ, మరియమ్మ, సుబ్బలక్ష్మి, మహేశ్వరి, ఆశా వర్కర్స్ యూనియన్ కన్వీనర్ చంద్రలీల, హుస్సేన, కులాయమ్మ తదితరులు పాల్గొన్నారు.