SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 21 July 2026, 6:49 pm Posted by : SALAM PRODDATUR

నీట్ పేపర్ లీక్‌కు బాధ్యత వహించి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి–ప్రజా సంఘాలు

–సోనమ్ వాంగ్‌చుక్‌పై దాడి, జంతర్‌మంతర్‌లో విద్యార్థులపై లాఠీచార్జ్‌ను ఖండిస్తూ ప్రొద్దుటూరులో ప్రజాసంఘాల నిరసన

 

సలాం ప్రొద్దుటూరు:

 

నీట్ (NEET) పరీక్ష పేపర్ లీకేజీ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన మంత్రి పదవికి వెంటనే రాజీనామా చేయాలని ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. అలాగే సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌పై జరిగిన దాడిని, ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ఆదేశాలతో జరిగిన లాఠీచార్జ్‌ను తీవ్రంగా ఖండించారు.

ఈ మేరకు మంగళవారం ప్రొద్దుటూరు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పట్టణ  ఉన్న శివాలయం సర్కిల్ వద్ద శాంతియుత నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నిరసనకారులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, విద్యా వ్యవస్థను కాపాడాలని, పరీక్షల నిర్వహణలో పారదర్శకత పాటించాలని డిమాండ్ చేశారు.వక్తలు మాట్లాడుతూ, దేశంలోని లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. ఇలాంటి ఘటనలు విద్యార్థుల నమ్మకాన్ని దెబ్బతీస్తాయని, ఇందుకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.అలాగే ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడం కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. ప్రజాస్వామ్య హక్కులను అణచివేసే చర్యలను వెంటనే విరమించుకోవాలని, విద్యార్థుల గొంతును అణిచివేయకుండా వారి సమస్యలను పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

 

ఈ నిరసన కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు, యువజన నాయకులు, సామాజిక కార్యకర్తలు, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొని సంఘీభావం తెలిపారు.