సలాం ప్రొద్దుటూరు:
ప్రొద్దుటూరులో రాయలసీమ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో ‘మన రాయలసీమ’ 4వ బులిటెన్ పుస్తకావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ (RCP) రాష్ట్ర కార్యదర్శి రవి శంకర్ రెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయలసీమ అభివృద్ధి, ప్రాంతీయ సమస్యల పరిష్కారం, ప్రజల్లో చైతన్యం పెంపొందించడంలో ఇటువంటి బులిటెన్లు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. రాయలసీమకు సంబంధించిన చారిత్రక, సామాజిక, ఆర్థిక అంశాలను ప్రజలకు చేరవేయడంలో రచయితలు, మేధావులు చేస్తున్న కృషిని ఆయన అభినందించారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత పాలగిరి విశ్వప్రసాద్ రెడ్డి, కవి, రచయిత సికిందర్, రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ ప్రొద్దుటూరు బాధ్యులు షరీఫ్, ఆర్సీపీ జిల్లా కమిటీ సభ్యులు మడగలం ప్రసాద్ తదితరులు పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు. కార్యక్రమానికి మేధావులు, సాహితీవేత్తలు, పార్టీ నాయకులు, ప్రజలు హాజరై విజయవంతం చేశారు.