కడప (వైఎస్ఆర్ జిల్లా), జూలై 18: ‘స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమంలో భాగంగా శనివారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ‘బల్క్ వ్యర్థాల ఉత్పత్తిదారుల నిర్వహణ మరియు నమోదు’పై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యాలయాలను, నగరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు “బల్క్ వ్యర్థాల ఉత్పత్తిదారుల గుర్తింపు మరియు నమోదు” నినాదంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి (DM&HO) డాక్టర్ యుగంధర్ తెలిపారు. ఇకపై నగరంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్లలో ఎక్కువ మొత్తంలో విడుదలయ్యే చెత్తను అక్కడికక్కడే తడి, పొడి చెత్తగా విడదీసి బాధ్యతాయుతంగా నిర్వహించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ యుగంధర్ కార్యాలయంలోని అన్ని గదులను స్వయంగా పరిశీలించి, వ్యర్థాల నిర్వహణ తీరును సమీక్షించారు. నూతన నిబంధనల ప్రకారం చెత్తను వేరు చేయాలని, బయో మెడికల్ వేస్టేజ్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని సిబ్బందిని ఆదేశించారు. పరిశుభ్రమైన, ఆరోగ్యవంతమైన వాతావరణం కోసం ప్రతి సంస్థ, ప్రతి పౌరుడు భాగస్వాములు కావాలని పిలుపునిస్తూ సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో RBSK కోఆర్డినేటర్ డాక్టర్ ఆరిపుల్లా, నేషనల్ హెల్త్ మిషన్ కోఆర్డినేటర్ డాక్టర్ మహమ్మద్ తాహా, డెమో భారతి, అడ్మినిస్ట్రేటివ్ అధికారి విజయ భాస్కర్ మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.