SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 18 July 2026, 1:08 pm Posted by : SALAM PRODDATUR

మొడంపల్లి మస్జిద్‌లో డా. వి.ఎస్. ముక్తియార్‌కు ఘన సన్మానం

 

–వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు ముస్లింలంతా ఐక్యంగా కృషి చేయాలి: డా. వి.ఎస్. ముక్తియార్

సలాం ప్రొద్దుటూరు:

వక్ఫ్ బోర్డు మరియు అంజుమన్ అహలే ఇస్లాం కమిటీల సంయుక్త ఆధ్వర్యంలో శనివారం ప్రొద్దుటూరులోని మొడంపల్లి మస్జిద్‌లో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ షేక్ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అంజుమన్ అహలే ఇస్లాం కమిటీ అధ్యక్షులు డా. వి.ఎస్. ముక్తియార్‌ను ఘనంగా సత్కరించారు. ముస్లిం సమాజ అభ్యున్నతి, సామాజిక సేవా కార్యక్రమాల్లో ఆయన అందిస్తున్న విశిష్ట సేవలను కొనియాడుతూ శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందజేశారు.

ఈ సందర్భంగా సీనియర్ అడ్వకేట్ దాదా పీర్ మాట్లాడుతూ, అంజుమన్ అహలే ఇస్లాం కమిటీ సమాజానికి అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు. కమిటీని మరింత బలోపేతం చేస్తూ విద్య, సామాజిక సంక్షేమం, మతపరమైన కార్యక్రమాల అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.

సీనియర్ న్యాయవాది జిలాన్ మాట్లాడుతూ, కులమత భేదాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలను సమానంగా ఆదరిస్తూ సేవలందిస్తున్న నాయకుడిగా డా. వి.ఎస్. ముక్తియార్ గుర్తింపు పొందారని కొనియాడారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఆయన చూపుతున్న చొరవ అభినందనీయమని అన్నారు.

ఏపీ వక్ఫ్ బోర్డు డైరెక్టర్ బేపారి జాకీర్ మాట్లాడుతూ, ప్రొద్దుటూరు నుంచి రాష్ట్రస్థాయి నాయకుడిగా ఎదిగి ముస్లిం సమాజానికి సేవలందించడం గర్వకారణమన్నారు. తన సేవా దృక్పథం, అంకితభావంతో డా. ముక్తియార్ రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు సాధించారని అభినందించారు.

సన్మానానికి స్పందించిన డా. వి.ఎస్. ముక్తియార్ మాట్లాడుతూ, వక్ఫ్ ఆస్తులు ముస్లిం సమాజ భవిష్యత్తుకు విలువైన ఆస్తులని, వాటి పరిరక్షణ ప్రతి ముస్లింయొక్క నైతిక బాధ్యత అని స్పష్టం చేశారు. దాతలు సమాజ సంక్షేమం కోసం అందించిన వక్ఫ్ ఆస్తులను కాపాడి, విద్య, సంక్షేమం, సామాజికాభివృద్ధికి వినియోగించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం అనేక వక్ఫ్ ఆస్తులు నిర్లక్ష్యానికి గురై ఆక్రమణలకు లోనవుతున్న పరిస్థితి ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు.

ముస్లిం సమాజం రాజకీయ, సామాజిక విభేదాలకు అతీతంగా ఐక్యంగా నిలిచి వక్ఫ్ ఆస్తుల పరిరక్షణతో పాటు సమాజాభివృద్ధికి కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. మంచి లక్ష్యాల సాధనలో యువత ముందుండాలని, సమాజ శ్రేయస్సే అందరి ప్రధాన ధ్యేయంగా ఉండాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో అంజుమన్ అహలే ఇస్లాం కమిటీ సభ్యులు, టీడీపీ పట్టణ ఉపాధ్యక్షులు కె. ఖలీల్ భాషా, ప్రాంత ప్రముఖులు, కమిటీ ప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ముస్లిం పెద్దలు, యువకులు మరియు పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు.