SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 14 July 2026, 12:34 am Posted by : SALAM PRODDATUR

అవినీతిపరుల పైన విచారణ జరపాలి

 

 

పి జి ఆర్ ఎస్ లో వినతిపత్రం అందజేసిన ఆర్ ఎస్ యు నాయకులు

 

– ప్రత్యేక విచారణ కమిటీ ఏర్పాటు చేసి వాస్తవాలు వెలికితీయాలి

 

– ఆర్ ఎస్ యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తొండంనాటి ప్రశాంత్ డిమాండ్

 

సలాం ప్రొద్దుటూరు (కడప):

 

కడప జిల్లా జూనియర్ కళాశాలల మాజీ ఆర్ఐ వెంకటేశ్వర్లు, ఔట్‌సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్ సుబ్బారెడ్డిపై వచ్చిన అవినీతి, అధికార దుర్వినియోగం, అనుమానాస్పద ఆర్థిక లావాదేవీల ఆరోపణలపై ప్రత్యేక కమిటీతో సమగ్ర, నిష్పాక్షిక విచారణ జరిపి, ఆరోపణలు రుజువైతే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ (ఆర్ ఎస్ యు) ఆధ్వర్యంలో పి జి ఆర్ ఎస్ లో వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఆర్ ఎస్ యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తొండంనాటి ప్రశాంత్ మాట్లాడుతూ, మాజీ ఆర్ఐ వెంకటేశ్వర్లు విధుల్లో ఉన్న సమయంలో జరిగినట్లు ఆరోపించబడుతున్న అవకతవకలు, అధికార దుర్వినియోగంపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగి పదవీ విరమణ చేసినప్పటికీ, విధుల్లో ఉన్న సమయంలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపి, ఆరోపణలు నిజమని తేలితే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు.

అదేవిధంగా, ఔట్‌సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్ సుబ్బారెడ్డి ఖాతాకు కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలకు సంబంధించిన ఫోన్‌పే లేదా ఇతర డిజిటల్ చెల్లింపు మార్గాల ద్వారా నగదు బదిలీలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేసి, చట్టబద్ధమైన ప్రక్రియ ప్రకారం సంబంధిత ఆర్థిక లావాదేవీలను పరిశీలించి వాస్తవాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.

గత కొంతకాలంగా ఈ అంశంపై ఆర్ ఎస్ యు ఆధ్వర్యంలో ఆందోళనలు, ధర్నాలు నిర్వహిస్తూ సంబంధిత అధికారులకు పలుమార్లు వినతిపత్రాలు అందజేసినప్పటికీ, ఇప్పటివరకు స్పష్టమైన చర్యలు కనిపించడం లేదని ప్రశాంత్ పేర్కొన్నారు. జిల్లా యంత్రాంగం తక్షణమే స్పందించి నిష్పాక్షిక విచారణకు ఆదేశించాలని కోరారు.

విచారణ పారదర్శకంగా జరిగేందుకు అవసరమైన పరిపాలనా చర్యలు తీసుకోవాలని, ఆరోపణలు రుజువైతే బాధ్యులపై శాఖాపరమైన, చట్టపరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఎస్ యు నగర్ కార్యదర్శి యశ్వంత్, నగర సాయి కార్యదర్శి వంశి, అజిత్, కిరణ్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.