SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 13 July 2026, 10:30 pm Posted by : SALAM PRODDATUR

ప్రొద్దుటూరుకు జూలై 15న నారా లోకేష్.. నంద్యాల కొండారెడ్డి

 

 

–టీడీపీ శ్రేణులకు నాయకుల పిలుపు

 

సలాం ప్రొద్దుటూరు:

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జూలై 15న ప్రొద్దుటూరుకు రానున్న నేపథ్యంలో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీడీపీ నాయకులు నంద్యాల కొండారెడ్డి కార్యకర్తలకు పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి మాట్లాడారు.

 

లోకేష్ పర్యటన సందర్భంగా పార్టీ కార్యకర్తలతో సమావేశమై వారిలో ఉత్సాహాన్ని నింపడంతో పాటు పార్టీ బలోపేతానికి అవసరమైన అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో బూత్ ఇన్‌చార్జులు, కన్వీనర్లు, కో-కన్వీనర్లు, గ్రామ, వార్డు, యూనిట్, క్లస్టర్, మండల, టౌన్ కమిటీల సభ్యులు సహా పార్టీ కార్యవర్గం మొత్తం తప్పనిసరిగా హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు.

 

ప్రొద్దుటూరులో టీడీపీ శ్రేణుల ఐక్యతను చాటిచెప్పే విధంగా భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని నారా లోకేష్‌కు ఘన స్వాగతం పలకాలని పిలుపునిచ్చారు. అదే సమయంలో నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లే అవకాశం కూడా ఈ సమావేశం ద్వారా లభిస్తుందని పేర్కొన్నారు.

 

సమావేశానికి హాజరయ్యే ప్రతి కార్యకర్త తప్పనిసరిగా పార్టీ సభ్యత్వ కార్డును మెడలో ధరించి రావాలని సూచించారు. భద్రతా కారణాల దృష్ట్యా స్క్రీనింగ్ ఉండే అవకాశం ఉన్నందున సభ్యత్వ కార్డు వెంట తీసుకురావడం తప్పనిసరి అని స్పష్టం చేశారు.

 

జూలై 15 బుధవారం మధ్యాహ్నం సుమారు 2.30 గంటలకు కార్యక్రమం ప్రారంభం కానుండగా, కార్యకర్తలు కనీసం గంట ముందుగానే వేదిక వద్దకు చేరుకోవాలని కోరారు. బైపాస్ రోడ్డులో తిమ్మయ్య కళ్యాణ మండపం సమీపంలోని ఓపెన్ గ్రౌండ్‌లో సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి ముందుగానే చేరుకుని భోజనం ముగించుకుని వేదిక వద్ద క్రమశిక్షణతో కూర్చోవాలని పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు.