సలాం ప్రొద్దుటూరు :
ప్రొద్దుటూరులో 13 నెలల పసికందుకు ఒక అరుదైన, భయంకరమైన వ్యాధి వెంటాడుతోంది. ఆ పసిప్రాణాన్ని కాపాడుకోవడానికి.. అక్షరాలా 16 కోట్ల రూపాయలు కావాలి. అంత భారీ మొత్తాన్ని సంపాదించలేక.. కన్నబిడ్డను కాపాడుకోలేక ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన వర్షిత్ అనే సంవత్సరం వయసున్న బాలుడికి అరుదైన ఎస్ఎంఎ టైప్ 2 వ్యాధి సోకిందని ఈ వ్యాధి నివారణ చికిత్స కోసం దాదాపు 16 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని బాలుడు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. బాలుడి వైద్య ఖర్చులకోసం ప్రొద్దుటూరులోని కొంతమంది సోషల్ మీడియా ప్రతినిధులు వారికి మద్దతుగా నిలబడి పట్టణంలోని దుకాణాల వద్దకు వెళ్లి ఫండింగ్ చేసే కార్యక్రమం చేపట్టారు. ప్రొద్దుటూరు ప్రజలందరూ వీలైనంతవరకు ఆర్థిక సహాయం చేయాలని కోరారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయుడును కలిసి తమ బాలుడి యొక్క పరిస్థితిని తెలియజేశామని.. ప్రభుత్వం కూడా తమను ఆదుకోవాలని బాలుడి తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు.