సలాం ప్రొద్దుటూరు (శ్రీ సత్య సాయి):
అధికారులందరూ సమన్వయంతో, సమిష్టిగా పనిచేసి జిల్లాలో “పల్స్ పోలియో” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ మరియు మేజిస్ట్రేట్ శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని పీజీఎస్ హాలు నందు పల్స్ పోలియో జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశాన్ని కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెల 28.06.2026 (ఆదివారం) న జిల్లాలోని ఐదు సంవత్సరాలలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలన్నారు. ఇందుకోసం జూన్ 27 నుండి 30 వరకు నిరంతర విద్యుత్ సరఫరా అందించాలని విద్యుత్ శాఖను ఆదేశించారు. ఆదివారం అయినప్పటికీ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను పోలియో బూత్లుగా ఉపయోగించుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రయాణాల్లో ఉండే పిల్లల కోసం ట్రాన్సిట్ బూత్ల వద్ద ఉదయం పూట బస్సులను కొద్దిసేపు ఆపి, పల్స్ పోలియో సిబ్బంది చుక్కలు వేసేలా సహకరించాలని సూచించారు. జూన్ 27న గ్రామాల్లో టామ్ టామ్ (దండోరా) ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, డీఆర్ఓ కొండయ్య,ఎస్డిసి విజయ కుమారి, డీఆర్డీఏ పీడీ నరసయ్య, డీఎంహెచ్ఓ డాక్టర్ ఫైరోజా బేగం, ఇన్ఛార్జ్ డీఐఓ డాక్టర్ చెన్నా రెడ్డి, డీపీహెచ్ఎన్ఓ వీరమ్మ, ఎస్ఓ కళాధర్, ఐసీడీఎస్ పీడీ ప్రమీలమ్మ, డీపీఓ సమత, సీహెచ్ఓ వన్నప్ప మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.