సలాం ప్రొద్దుటూరు (అనంతపురం):
12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన యోగాంధ్ర–2026 కార్యక్రమంలో అనంతపురం జిల్లా క్రీడాకారులు విశిష్ట ప్రతిభ కనబరిచారు. అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో సోమవారం రాష్ట్ర స్థాయిలో విజయం సాధించిన యోగాంధ్ర విజేతలు జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ గారిని కలువగా.. యోగాంధ్ర విజేతలను జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. ఈనెల 15, 16, 17 తేదీలలో నిర్వహించిన జిల్లా స్థాయి యోగా పోటీలలో ప్రథమ స్థానాలు సాధించిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. అనంతరం జూన్ 18, 19 తేదీలలో విజయవాడ సమీపంలోని గుంటుపల్లి డాన్ బాస్కో ఇంగ్లీష్ మీడియం స్కూల్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి యోగాంధ్ర పోటీలలో అనంతపురం జిల్లా నుంచి 18 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. వారిలో ఆరుగురు విజేతలుగా నిలిచి జిల్లా ఖ్యాతిని రాష్ట్ర స్థాయిలో చాటారు.
*విజేతల వివరాలు :*
*జూనియర్ విభాగం :*
* *ఫోటోగ్రఫీ పోటీలు – మొదటి బహుమతి ఆరో తరగతి విద్యార్థిని వరుణవి(పోలీస్ శాఖకు చెందిన బుల్లె వీర, బుల్లె అరుణ దంపతుల తనయ).*
– స్లోగన్ పోటీలు – గోపాలం గిరిధర్ : ద్వితీయ స్థానం
*యంగ్ విభాగం*
– క్విజ్ పోటీలు – డాక్టర్ సృజన : ప్రథమ స్థానం
– స్లోగన్ పోటీలు – భావన రసజ్ఞ : తృతీయ స్థానం
*సీనియర్ విభాగం :*
– సోలో యోగాసన పోటీలు – ఎం. చలపతి : తృతీయ స్థానం
– యోగా పాటల పోటీలు – ఎ. లక్ష్మీనారాయణ : తృతీయ స్థానం
– *విజేతలలో భావన రసజ్ఞ మరియు ఎం.చలపతి గత సంవత్సరం యోగాంధ్ర–2025 పోటీలలో కూడా పాల్గొని ప్రతిభ కనబరిచారు. ముఖ్యంగా ఎం.చలపతి 2025 సంవత్సరంలో విశాఖపట్నంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సమక్షంలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రధాన కార్యక్రమంలో యోగా ప్రోటోకాల్ ప్రదర్శనలో పాల్గొనడం విశేషం. వృత్తిరీత్యా పోలీస్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న ఎం.చలపతి యోగా రంగంలోనూ విశేష సేవలందిస్తూ, పోలీస్ శాఖ నిర్వహించే వివిధ యోగా పోటీలలో పాల్గొని ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకున్నారు. జిల్లా స్థాయి పోటీలను విజయవంతంగా నిర్వహించి, ప్రతిభావంతులైన పోటీదారులను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేసి విజయవాడకు తీసుకెళ్లి, వారు బహుమతులు సాధించేలా ప్రోత్సహించినందుకు యోగాంధ్ర అనంతపురం జిల్లా ఇన్చార్జ్ జి.రామకృష్ణారెడ్డిని, యోగాంధ్ర పోటీల ఇన్చార్జ్ మరియు ఆయుష్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రామ్ కుమార్ ని, ఆయుష్ విభాగానికి చెందిన యోగా మాస్టర్ కృష్ణవేణిని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. అలాగే రాష్ట్ర స్థాయిలో విజయం సాధించిన ఈ విజేతలకు జూన్ 21న విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రధాన కార్యక్రమంలో ప్రత్యేక స్థానం కల్పించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ప్రముఖ యోగ గురువు శ్రీ రాందేవ్ బాబా మరియు మంత్రుల సమక్షంలో నిర్వహించిన యోగా ప్రోటోకాల్ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించగా, మంత్రులు స్వయంగా విజేతలను అభినందించి మోమెంటో సర్టిఫికెట్ లను అందించి వారి ప్రతిభను కొనియాడారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, యోగాంధ్ర కార్యక్రమం ద్వారా జిల్లాలోని యోగ సాధకులు రాష్ట్ర స్థాయిలో తమ ప్రతిభను చాటడం ఎంతో గర్వకారణమని, భవిష్యత్తులో జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలలో కూడా రాణించి అనంతపురం జిల్లా ఖ్యాతిని మరింత పెంచాలని ఆకాంక్షించారు.